
IND vs SA 5th T20I : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా వర్షం లేదా వెలుతురు లేమి కారణంగా మ్యాచ్లు ప్రభావితమవుతాయి.. కానీ లక్నోలోని ఇస్నా స్టేడియంలో దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లోపం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం వలన ఆటగాళ్లు, అంపైర్లకు మైదానంలో ఆడటం సురక్షితం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు సిరీస్లో నిర్ణయాత్మకమైన ఐదవ, చివరి టీ20 మ్యాచ్పై అందరి దృష్టి ఉంది, ఇది శుక్రవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉంది. లక్నో మ్యాచ్ రద్దు కావడంతో, సౌతాఫ్రికాకు సిరీస్ను సమం చేయడానికి ఈ మ్యాచ్ చివరి అవకాశం. ఈ నేపథ్యంలో, అహ్మదాబాద్లో వాతావరణం, ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, అహ్మదాబాద్లోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లక్నో కంటే మెరుగ్గా ఉంది. లక్నోలో AQI 400 దాటగా, అహ్మదాబాద్లో ఇది 170–180 మధ్య నమోదైంది. AQI.in నివేదిక ప్రకారం.. ఈ స్థాయిని అన్ హెల్తీ కేటగిరీగా వర్గీకరించినప్పటికీ, ఇది ఆట సమయంలో విజిబిలిటీ పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. PM10, PM2.5 స్థాయిలు పెరిగినప్పటికీ మ్యాచ్ ఆటంకం లేకుండా సాగే అవకాశం ఉంది. లక్నో సంఘటన తరువాత బీసీసీఐ శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో మ్యాచ్లు నిర్వహించే విధానంపై మాత్రం ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతానికి అహ్మదాబాద్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సంకేతాలు అందుతున్నాయి.