
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ కు వచ్చేసింది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్లో తలపడనున్నాయి. అయితే ఈ మెగా ఫైట్కు ముందు అభిమానులను ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది.. ఒకవేళ వరుణుడు కన్నెర్ర చేసి మ్యాచ్ను అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? గెలుపోటములు ఎలా నిర్ణయిస్తారు? ఏ జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో సామాన్యుడికి అర్థమయ్యేలా సులభంగా తెలుసుకుందాం.
నౌకౌట్ మ్యాచుల కోసం ఐసీసీ ప్రత్యేకంగా రిజర్వ్ డే సౌకర్యాన్ని కల్పించింది. అంటే, మార్చి 5న వర్షం పడి మ్యాచ్ జరగకపోతే, మరుసటి రోజు అంటే మార్చి 6న ఆ మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ 5వ తేదీన మ్యాచ్ మొదలై, మధ్యలో వర్షం వస్తే.. ఎక్కడైతే ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే రిజర్వ్ డే రోజున కొనసాగిస్తారు. ఫలితం మైదానంలోనే తేలాలన్నది ఐసీసీ ముఖ్య ఉద్దేశం. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తూ మార్చి 5, 6 తేదీల్లో కూడా వర్షం తగ్గకుండా, ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే మాత్రం టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. రెండు రోజులూ వర్షం వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే, సూపర్ 8 దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టుకే ఫైనల్ టికెట్ దక్కుతుంది. ఇక్కడే భారత్కు చిక్కు వచ్చి పడింది. సూపర్ 8లో ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. కానీ, భారత్ రెండు మ్యాచుల్లో గెలిచి, ఒక మ్యాచ్లో ఓటమి పాలైంది. ఈ లెక్కన చూస్తే, వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. అందుకే భారత అభిమానులు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తూ వర్షం పడకూడదని కోరుకుంటున్నారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 29 సార్లు తలపడగా.. భారత్ 17 సార్లు, ఇంగ్లాండ్ 12 సార్లు విజయం సాధించాయి. వరల్డ్ కప్ చరిత్ర చూస్తే.. 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మనల్ని 10 వికెట్ల తేడాతో ఓడించగా, 2024 సెమీఫైనల్లో భారత్ ప్రతీకారం తీర్చుకుని ఇంగ్లాండ్ను ఇంటికి పంపింది. ఇప్పుడు 2026లో మూడోసారి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో, వరుణుడు ఎవరికి సహకరిస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..