ICC U19 World Cup: పాక్‌కు కళ్లెం వేసి.. సెమీస్‌లోకి భారత్ U19

253 పరుగుల ఛేజ్‌ను 33.3 ఓవర్లలోపు పూర్తి చేయాల్సిన పాకిస్థాన్ U19 జట్టును భారత బౌలర్లు అడ్డుకున్నారు. అయుష్ మాథ్రే లీడ్ చేస్తున్న భారత్ U19 కీలక మ్యాచ్‌లో పాక్‌ను ఎలిమినేట్ చేస్తూ U19 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ICC U19 World Cup: పాక్‌కు కళ్లెం వేసి.. సెమీస్‌లోకి భారత్ U19
India U19 Team

Updated on: Feb 01, 2026 | 8:20 PM

భారత్ అండర్-19 జట్టు.. పాకిస్థాన్ అండర్-19ను టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తూ U19 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో అయుష్ మాథ్రే లీడ్ చేస్తున్న భారత్ అవసరమైన ఫలితాన్ని సాధించింది. సెమీస్ రేసులో నిలవాలంటే పాకిస్థాన్ 253 పరుగుల లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోపు ఛేదించాల్సి ఉండగా, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆ లక్ష్యాన్ని అడ్డుకున్నారు. ఛేజ్ కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నెట్ రన్‌రేట్ పరంగా భారత్ ఆధిక్యం సాధించి చివరి నాలుగులోకి దూసుకెళ్లింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 252 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో వేదాంత్ త్రివేది ఓపికగా ఆడుతూ 98 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు బేస్ వేశారు. చివర్లో కానిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్‌లు వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు ఊపు ఇచ్చారు. కానిష్క్ (29 బంతుల్లో 35), ఖిలాన్ (15 బంతుల్లో అజేయంగా 21) కలిసి కేవలం 5.1 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌కు చేరగా, పాకిస్థాన్ వరల్డ్ కప్ ప్రయాణానికి తెరపడింది.