
Team India : ప్రముఖ క్రికెట్ కామెంటర్, వాయిస్ ఆఫ్ క్రికెట్ హర్షా భోగ్లే 2025 సంవత్సరానికి సంబంధించి తన అత్యుత్తమ వన్డే జట్టును ప్రకటించారు. ఈ ఏడాది వన్డేలు తక్కువగా జరిగినప్పటికీ, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆయన ఒక పటిష్టమైన టీమ్ను సెలక్ట్ చేశారు. అయితే, ఈ జట్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఓపెనర్లుగా రోహిత్, షాయ్ హోప్
హర్షా భోగ్లే తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వెస్టిండీస్ స్టార్ షాయ్ హోప్ను ఎంచుకున్నారు. రోహిత్ ఈ ఏడాది 50 సగటుతో 650 పరుగులు చేయగా, షాయ్ హోప్ 670 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్ కంటే హోప్ మెరుగైన ప్రదర్శన చేశాడని భోగ్లే అభిప్రాయపడ్డారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా షాయ్ హోప్ కే అప్పగించారు.
మధ్యవరసలో కింగ్ కోహ్లీ, జో రూట్
నెంబర్ 3 స్థానంలో ఎటువంటి సందేహం లేకుండా విరాట్ కోహ్లీని సెలక్ట్ చేశారు. ఈ ఏడాది 65 సగటుతో 651 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక స్కోరర్గా నిలిచాడు కోహ్లీ. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ ను ఎంచుకున్నారు. రూట్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగులు (15 మ్యాచ్ల్లో 808) చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. వీరితో పాటు సౌతాఫ్రికాకు చెందిన మాథ్యూ బ్రిట్జ్కే, న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తున్నారు.
బుమ్రాకు ఎందుకు చోటు దక్కలేదు?
బౌలింగ్ లో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ (11 మ్యాచ్ల్లో 19 వికెట్లు) చోటు దక్కించుకోగా, పేసర్లుగా మ్యాట్ హెన్రీ (31 వికెట్లు), జోఫ్రా ఆర్చర్, జేడెన్ సీల్స్ను ఎంచుకున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా, ట్రావిస్ హెడ్ వంటి దిగ్గజాలకు చోటు ఇవ్వకపోవడంపై భోగ్లే క్లారిటీ ఇచ్చారు. ఇది బెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ కాదని, 2025లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారి జాబితా అని ఆయన స్పష్టం చేశారు. బుమ్రా తక్కువ వన్డేలు ఆడటం వల్లే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరించారు.
హర్షా భోగ్లే వన్డే ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, షాయ్ హోప్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, జో రూట్, మాథ్యూ బ్రిట్జ్కే, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, జోఫ్రా ఆర్చర్, జేడెన్ సీల్స్, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..