Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు?

Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా ఓటముల పై బీసీసీఐ ఆగస్టులో రివ్యూ మీటింగ్ నిర్వహించనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కింద పని చేసే సపోర్ట్ స్టాఫ్‌ భవితవ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు?
Gautam Gambhir

Updated on: Jul 26, 2026 | 9:43 AM

Team India : భారత క్రికెట్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియా కనబరిచిన ప్రదర్శనపై వచ్చే నెల (ఆగస్టు) ప్రారంభంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4 తేడాతో భారత్ కోల్పోయింది. కేవలం జింబాబ్వేపై మాత్రమే అయ్యర్ నేతృత్వంలోని భారత్ సిరీస్ విజయాన్ని అందుకోగలిగింది.

గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు పడే అవకాశం

క్రికెట్ సమాచార పోర్టల్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో కేవలం జట్టు ప్రదర్శనపైనే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొంతమంది సపోర్ట్ స్టాఫ్ సభ్యుల భవిష్యత్తుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో వారిని పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. “ఆగస్టులో మేము ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాము” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ లలో వైట్ బాల్ సిరీస్ ఓటములకు గల కారణాలను విశ్లేషించి, సరిదిద్దే చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక బ్యాడ్ ఫేజ్ మాత్రమే: సైకియా

టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టి20 జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదనే విషయాన్ని బీసీసీఐ గమనిస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం. దీనిని మేము ఒక తాత్కాలిక బ్యాడ్ ఫేజ్ గా మాత్రమే భావిస్తున్నాము” అని సైకియా మీడియాకు తెలిపారు. జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు అవసరమైన మార్పులు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

తీవ్ర నిర్ణయాలు వద్దని సునీల్ గవాస్కర్ హెచ్చరిక

మరోవైపు, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సలహా ఇచ్చారు. ప్రక్షాళన పేరుతో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు. “ఓటమిపై బీసీసీఐ రివ్యూ నిర్వహించి కొందరిపై వేటు వేస్తుందని పుకార్లు వస్తున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన చర్య అవుతుంది. ఎందుకంటే కేవలం నాలుగు నెలల క్రితమే భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది” అని స్పోర్ట్‌స్టార్ పత్రికలో రాశారు.

ప్లేయర్ల సాంకేతిక లోపాలపై గవాస్కర్ విశ్లేషణ

ఐపిఎల్ ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం వల్లనే భారత బ్యాటర్లు విఫలమవుతున్నారనే వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించారు. “ఫ్లాట్ పిచ్‌లపై ఆడి చెడిపోయారని అనడం సరికాదు. ఐపిఎల్‌లోని ప్లాట్ వికెట్లపై కూడా భారత బ్యాటర్లు షార్ట్ బాల్స్ ఆడటానికి ఇబ్బంది పడ్డారు. అది వారి సాంకేతిక లోపం. ఫ్రంట్ ఫుట్‌పై భారం వేసి బ్యాక్ ఫుట్‌ను లాక్ చేయడం వల్ల.. ముఖం వైపు వచ్చే బంతిని ఎదుర్కొనేందుకు వీలుగా శరీరం బరువును మార్చలేకపోతున్నారు” అని లోపాలను సునీల్ గవాస్కర్ సాంకేతికంగా విశ్లేషించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us