
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ముందు భారత క్రికెట్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్, జట్టు కూర్పు, కెప్టెన్సీపై దృష్టి సారించారు. ముఖ్యంగా, అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ను నియమించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా, ప్రస్తుతం టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శుభ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించేందుకు గంభీర్ సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాక, టీ20 ఫార్మాట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొదట్లో సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్గా నియమించినప్పటికీ, ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉంటే, జట్టులో ఒకే సంస్కృతి, ఒకే ఆట తీరు అలవడుతుందని గంభీర్ నమ్ముతున్నాడు. ఇది జట్టులో ఆటగాళ్ల మధ్య సమన్వయం పెంచుతుందని, భవిష్యత్తులో జట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే, ఇంగ్లాండ్లో కెప్టెన్గా రాణించిన శుభ్మన్ గిల్కు టీ20 పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆసియా కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తొలగించి, గిల్కు బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు.
గంభీర్ వచ్చాక జట్టులో ఆటగాళ్లకు వారి స్థానంపై స్పష్టత వచ్చింది. దీనికి నిదర్శనంగానే అభిషేక్ శర్మ, సంజు శాంసన్లని ఓపెనర్లుగా స్థిరపరిచారు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లు కావడంతో టీమ్కు మంచి ఆరంభాలు లభించాయి. అయితే, ఇప్పుడు ఒకే కెప్టెన్ వ్యూహంతో వీరికి అన్యాయం జరగవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కూడా టీ20ల్లోకి తిరిగి వస్తుండటంతో, ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. గిల్ను జట్టులోకి తీసుకుంటే, సంజు శాంసన్ను పక్కన పెట్టే అవకాశం ఎక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గిల్ బ్యాటింగ్ స్థానం కూడా సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది.
గంభీర్ జట్టులో తీసుకురావాలనుకుంటున్న మరో కీలక మార్పు ఏమిటంటే, ఒకరిని ఫినిషర్గా పరిమితం చేయకపోవడం. జట్టు మొత్తం టీ20 స్పెషలిస్ట్లతో నిండి ఉండాలని, వారు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ భావిస్తున్నారు. ఉదాహరణకు, ఫినిషర్గా పేరొందిన శివమ్ దూబేను టాప్ ఆర్డర్కు పంపిస్తే, ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దూబే తన పవర్ హిట్టింగ్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని గంభీర్ నమ్ముతున్నాడు. ‘ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. రోల్స్ నైపుణ్యాల ఆధారంగా ఉండాలి, బ్యాటింగ్ స్థానం ఆధారంగా కాదు’ అని గంభీర్ ఆలోచనగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త వ్యూహాలతో టీమ్ ఇండియా ఆసియా కప్, భవిష్యత్తులో ఎలా రాణిస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..