
T20 World Cup 2026 : 2026లో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం క్వాలిఫైయింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 20 జట్లతో కూడిన తుది జాబితా ఖరారైంది. ఒమన్లో జరిగిన ఆసియా – ఈఏపీ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో జపాన్ను ఓడించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రపంచకప్కు అర్హత సాధించిన చివరి 20వ జట్టుగా నిలిచింది. ఈ క్వాలిఫైయింగ్ ద్వారా నేపాల్, ఒమన్తో పాటు యూఏఈ కూడా ప్రపంచకప్లో చోటు దక్కించుకుంది. 20 జట్ల మధ్య జరగబోయే ఈ మెగా టోర్నమెంట్ గురించి, క్వాలిఫై అయిన జట్ల పూర్తి జాబితా, వాటి అర్హత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2026లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో పాల్గొనడానికి అర్హత సాధించే జట్ల ప్రక్రియ చివరకు పూర్తయింది. ఈ అర్హత పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చివరి జట్టుగా తమ స్థానాన్ని దక్కించుకుని, 20 జట్ల తుది జాబితాను పూర్తి చేసింది. ఒమన్లో జరిగిన ఆఖరి ఆసియా – ఈఏపీ (ఆసియా – ఈస్ట్ ఏషియా పసిఫిక్) క్వాలిఫైయింగ్ మ్యాచ్లో యూఏఈ జట్టు జపాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులే చేయగలిగింది. యూఏఈ దీన్ని కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
ఒమన్లో జరిగిన ఆసియా-ఈస్ట్ ఏషియా-పసిఫిక్ క్వాలిఫైయర్లో టాప్-3 స్థానాల్లో నిలవడం ద్వారా యూఏఈ జట్టు ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ క్వాలిఫైయర్ ద్వారా యూఏఈతో పాటు నేపాల్, ఒమన్ జట్లు కూడా బుధవారం నాడే తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. దీనితో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 20 జట్ల తుది జాబితా సిద్ధమైంది.
వచ్చే టీ20 ప్రపంచకప్లో టైటిల్ కోసం పోరాడనున్న మొత్తం 20 జట్లు ఇవే: భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, అఫ్గానిస్థాన్, నేపాల్, ఒమన్, యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా, కెనడా, ఐర్లాండ్. భారత్, శ్రీలంక ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నందున నేరుగా అర్హత సాధించాయి.
ఈ 20 జట్లలో కొన్ని జట్లు ఆటోమేటిక్గా, మరికొన్ని ర్యాంకింగ్స్ ఆధారంగా, ఇంకొన్ని క్వాలిఫైయర్స్ ద్వారా తమ స్థానాలను దక్కించుకున్నాయి. గత ప్రపంచకప్లో సూపర్-8 వరకు చేరుకున్న అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్లో మెరుగ్గా ఉండటం వల్ల చోటు దక్కించుకున్నాయి. అమెరికా క్వాలిఫైయర్ నుండి కెనడా, యూరప్ క్వాలిఫైయర్ నుండి ఇటలీ, నెదర్లాండ్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్ నుండి నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మొట్టమొదట 2007 సంవత్సరంలో ప్రారంభమైంది. 2026 ఎడిషన్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్లో గత ఎడిషన్ ఛాంపియన్గా నిలిచిన భారత్ జట్టు ఈసారి తమ టైటిల్ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..