
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే మైదానం బయట ధోనీ అలవాట్ల గురించి నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ స్టిక్ టు క్రికెట్ ధోనీకి ఉన్న ఒక ప్రత్యేకమైన అలవాటు గురించి, ఆ విషయంలో ఒక భారతీయ బౌలర్ చేసే సాయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ధోనీకి హుక్కా తాగే అలవాటు ఉందని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా సామ్ బిల్లింగ్స్ స్టిక్ టు క్రికెట్ అనే పాడ్కాస్ట్లో చెప్పిన విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సామ్ బిల్లింగ్స్ 2018, 2019 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో టీమ్ హోటల్లో ధోనీ గది వాతావరణం ఎలా ఉండేదో ఆయన వివరించారు. “ధోనీ రూమ్ ఎప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడవచ్చు. అయితే ఆ గదిలో ఒక చిన్న హుక్కా సెటప్ ఉంటుంది. ఆ హుక్కా సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, దాన్ని ధోనీ కోసం సిద్ధం చేయడం ఒక ప్లేయర్ బాధ్యత. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్” అని బిల్లింగ్స్ సరదాగా వెల్లడించారు. ధోనీకి హుక్కా అందించడమే ఖలీల్ ప్రధాన పని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
ఖలీల్ అహ్మద్ విషయానికి వస్తే, గత సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడినప్పటికీ, ఐపీఎల్ 2025 వేలంలో సీఎస్కే ఇతడిని రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఐపీఎల్ 2026 కోసం కూడా సీఎస్కే ఖలీల్ అహ్మద్ను రిటైన్ చేసుకుంది. కేవలం బౌలింగ్ టాలెంట్ వల్లే కాకుండా, ధోనీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు. ఖలీల్ అహ్మద్ గ్రౌండ్లో వికెట్లు తీయడమే కాదు, ధోనీ రూమ్లో హుక్కా సెటప్ను కూడా మేనేజ్ చేయడంలో దిట్ట అని బిల్లింగ్స్ మాటలను బట్టి అర్థమవుతోంది.
సామ్ బిల్లింగ్స్ గతంలో సీఎస్కే గురించి మాట్లాడుతూ.. “చెన్నై టీమ్లో చోటు సంపాదించడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని” అని అన్నాడు. ఆ జట్టులో ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ చూసి ఆయన అలా వ్యాఖ్యానించారు. ఇకపోతే ఫ్రాంచైజీ క్రికెట్లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరని అడగ్గా, ఏమాత్రం ఆలోచించకుండా ఎంఎస్ ధోనీ పేరు చెప్పారు. ధోనీ హుక్కా అలవాటుపై గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జార్జ్ బెయిలీ కూడా మాట్లాడారు. ధోనీ తన గదిలో యువ ఆటగాళ్లతో హుక్కా తాగుతూ ముచ్చటించడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, మహీ గదిలో జరిగే ఈ హుక్కా ముచ్చట్లు సీఎస్కే టీమ్ బాండింగ్కు ఎంతగానో దోహదపడతాయన్నది స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..