Jasprit Bumrah : బుమ్రా బౌలింగ్‌లో బోల్డ్ అయినా అవుట్ ఇవ్వలేదు..టీమిండియా మ్యాచ్‌లో వింత ఘటన

Jasprit Bumrah : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ అద్భుతమైన యార్కర్‌కు స్టంప్స్ ఎగిరి పడ్డాయి. అయినా బ్యాటర్ అవుట్ కాలేదు సరే కదా, నమీబియాకు ఒక పరుగు కూడా లభించింది.

Jasprit Bumrah : బుమ్రా బౌలింగ్‌లో బోల్డ్ అయినా అవుట్ ఇవ్వలేదు..టీమిండియా మ్యాచ్‌లో వింత ఘటన
Jasprit Bumrah Yorker Free Hit

Updated on: Feb 13, 2026 | 6:53 AM

Jasprit Bumrah : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ అద్భుతమైన యార్కర్‌కు స్టంప్స్ ఎగిరి పడ్డాయి. స్టేడియం అంతా వికెట్ పడిందని సంబరాలు చేసుకుంటుండగా.. సీన్ కట్ చేస్తే బ్యాటర్ అవుట్ కాలేదు సరే కదా, నమీబియాకు ఒక పరుగు కూడా లభించింది. అది నో బాల్ కాకపోయినా పరుగు ఎలా వచ్చిందో చూసి ఫ్యాన్స్ అంతా నోరెళ్లబెట్టారు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 12న జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా ఇన్నింగ్స్ 7వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఆ ఓవర్ మూడో బంతికి నమీబియా ఓపెనర్ లారెన్ స్టైన్‌కాంప్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బుమ్రా తనదైన శైలిలో ఒక పదునైన యార్కర్‌ను సంధించాడు. ఆ బంతి నేరుగా వెళ్లి ఆఫ్-స్టంప్‌ను గాల్లోకి ఎగురవేసింది. భారత్ ఫీల్డర్లు సంబరాలు చేసుకుంటున్న సమయంలో, నమీబియా బ్యాటర్లు ఇద్దరూ పిచ్ మీద పరుగెత్తి ఒక పరుగు పూర్తి చేసేశారు. అయితే బుమ్రా వేసింది నో-బాల్ కాదు, కానీ అది ఫ్రీ-హిట్ బంతి కావడంతో బ్యాటర్ బోల్డ్ అయినా అవుట్ కాలేదు. అంతకుముందు బంతిని బుమ్రా నో-బాల్‌గా వేయడంతో ఈ ఫ్రీ-హిట్ లభించింది.

ఈ ఘటనను చూసిన క్రీడాభిమానులకు వెంటనే 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు గుర్తొచ్చింది. మెల్‌బోర్న్ మైదానంలో నవాజ్ వేసిన ఫ్రీ-హిట్ బంతికి విరాట్ కోహ్లీ క్లీన్ బోల్డ్ అయ్యాడు. కానీ ఫ్రీ-హిట్ కావడం వల్ల అది అవుట్ కాలేదు. ఆ సమయంలో కోహ్లీ, దినేష్ కార్తీక్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 3 పరుగులు బై రూపంలో తీశారు. అప్పుడు పాక్ ఆటగాళ్లు అంపైర్లతో వాదించినా, నిబంధనల ప్రకారం అవి చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు నమీబియా బ్యాటర్లు కూడా అదే తెలివితేటలు ప్రదర్శించి ఒక పరుగు రాబట్టారు.

ఈ ఒక పరుగు వచ్చినా నమీబియాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. భారత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక నమీబియా చతికిలపడింది. టీమిండియా బౌలర్ల ధాటికి నమీబియా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. దీనివల్ల భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ పాండ్యా (52) బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో మాయ చేశాడు. ఈ విజయంతో గ్రూప్-ఏ లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..