
Champions League T20 : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఛాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ మన ముందుకు రాబోతోంది. 2014లో ఆగిపోయిన ఈ టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల తన వార్షిక సమావేశంలో పచ్చజెండా ఊపింది. క్రికబజ్ నివేదిక ప్రకారం ఈ టోర్నమెంట్ ఎలా మొదలైంది, ఎందుకు ఆగిపోయింది, దాని ఫార్మాట్ ఎలా ఉండేది వంటి వివరాలు తెలుసుకుందాం. ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ను యుఎస్ఎఫ్ ఛాంపియన్స్ లీగ్ స్ఫూర్తితో ప్రారంభించారు. దీని మొదటి ఎడిషన్ 2009లో జరిగింది.. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన ఒక సంవత్సరం తర్వాత మొదలైంది. ఈ టోర్నమెంట్ యాజమాన్యం భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుల చేతుల్లో ఉండేది.
ఛాంపియన్స్ లీగ్ టీ20 తొలి ఎడిషన్ భారతదేశంలోనే జరిగింది. ఫైనల్ మ్యాచ్ న్యూ సౌత్ వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగింది. ఇందులో న్యూ సౌత్ వేల్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఐదు ఎడిషన్లలో, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే ఐపీఎల్ జట్లు నాలుగైదు సార్లు గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.
* 2009 – న్యూ సౌత్ వేల్స్ బ్లూ
* 2010 – చెన్నై సూపర్ కింగ్స్
* 2011 – ముంబై ఇండియన్స్
* 2012 – సిడ్నీ సిక్సర్స్
* 2013 – ముంబై ఇండియన్స్
* 2014 – చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్, సీపీఎల్, బిగ్ బాష్ లీగ్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ వంటివి ఒకే దేశంలోని వివిధ నగరాలకు చెందిన జట్ల మధ్య జరిగే లీగ్లు. కానీ ఛాంపియన్స్ టీ20 లీగ్ వాటికి భిన్నంగా ఉండేది. ఇందులో వివిధ దేశాల్లోని టీ20 లీగ్ల విజేతలు, లేదా మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ఒకదానితో ఒకటి పోటీపడేవి. ఉదాహరణకు, 2014లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి 3 జట్లు, బిగ్ బాష్ లీగ్ నుండి 2 జట్లు, రామ్ స్లామ్ టీ20 ఛాలెంజ్ నుండి 2 జట్లు, కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి 1 జట్టుకు నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా క్వాలిఫైయింగ్ స్టేజ్లో వేర్వేరు లీగ్ల నుండి 4 జట్లు పోటీపడేవి.
ఈ టోర్నమెంట్లో భారతదేశం, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక దేశాలకు చెందిన జట్లు పాల్గొనేవి. ఇంగ్లాండ్ కూడా మూడు ఎడిషన్లలో పాల్గొంది, కానీ 2012 తర్వాత అది ఇందులో పాల్గొనడానికి నిరాకరించింది. దీనికి కారణం ఛాంపియన్స్ లీగ్ టీ20 తమ దేశీయ క్రికెట్ షెడ్యూల్ను ప్రభావితం చేస్తుందని వారు భావించారు.
పాకిస్థాన్ జట్లెందుకు లేవు?
2008లో ముంబైలో పాకిస్థాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు దాడి చేసి ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను తీశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతినడం వల్ల పాకిస్థాన్ జట్లకు ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందలేదు. భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని, ఐపీఎల్ నుండి ఎక్కువ జట్లకు అవకాశం ఇచ్చేవారు. ఐపీఎల్ నుండి 4, ఇతర లీగ్ల నుండి గరిష్టంగా 2 జట్లు వారి లీగ్లలోని ప్రదర్శన ఆధారంగా పాల్గొనవచ్చు.
టోర్నమెంట్ ఎందుకు ఆగిపోయింది?
ప్రధానంగా ఆర్థిక నష్టాల కారణంగా స్టార్ స్పోర్ట్స్ 2015లో ఈ టోర్నమెంట్కు తమ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో టోర్నమెంట్ను రద్దు చేయాల్సి వచ్చింది. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు దీనిని నిలిపివేయడానికి అంగీకరించాయి. అయితే, అప్పటి నుండి ఇప్పుడు క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది. టెలివిజన్ ప్రసార హక్కుల ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ప్రజాదరణ బాగా పెరిగింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఛాంపియన్స్ లీగ్ టీ20 ని మళ్లీ ప్రారంభించబోతున్నారు.