Vaibhav Suryavanshi : పాక్‌తో ఓటమి.. షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!

Vaibhav Suryavanshi :దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేయడంపై డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చింది.

Vaibhav Suryavanshi : పాక్‌తో ఓటమి.. షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
Vaibhav Suryavanshi

Updated on: Dec 23, 2025 | 9:55 AM

Vaibhav Suryavanshi :దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేయడంపై డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ముఖ్యంగా కీలక సమయంలో జట్టు ఎందుకు విఫలమైందో వివరణ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరింది.

ఓటమిపై సమీక్షలో భాగంగా హెడ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేలతో బీసీసీఐ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. సాధారణంగా జూనియర్ స్థాయిలో ఇంతటి కఠినమైన సమీక్షలు జరగవు, కానీ త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు. వరల్డ్ కప్‌లో ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకూడదనేది బోర్డు ఉద్దేశం.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రేల ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్ బౌలర్ల స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో వీరు చూపించిన కొన్ని హావభావాలు, దూకుడు ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ షూ చూపిస్తూ చేసిన సంజ్ఞలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి క్రమశిక్షణపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బోర్డు వీరి తీరును తప్పుబట్టితే, రాబోయే టోర్నీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 జనవరిలో ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈలోపే ఈ సమీక్షను పూర్తి చేసి, లోపాలను సరిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది. ఆటలో వైఫల్యం ఒకెత్తు అయితే, మైదానంలో క్రమశిక్షణ తప్పడం మరో ఎత్తు అని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈసారి క్లీన్ అప్ ప్రక్రియ పక్కాగా ఉండబోతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..