
Form is Temporary.. Class is Permanent.. లెజెండ్స్ను ఉద్దేశించి ఈ మాట చెబుతుంటారు. ఆ సీనియర్ ఆటగాళ్లు ఫాం కోల్పోయినప్పటికీ.. ఎప్పటికైనా మళ్లీ తిరిగి సెంచరీలు సాధిస్తారని ఫ్యాన్స్ నమ్ముతుంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే మాట బాబర్ ఆజామ్కు సరిపోతుంది. 806 రోజులు, 83 ఇన్నింగ్స్ల తర్వాత తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు బాబర్ ఆజామ్. అయితే ఇదే తీరుగా వన్డేల్లో విరాట్ కోహ్లీ తన 71వ సెంచరీ సాధించడంతో.. కోహ్లితో బాబర్ ఆజామ్ను పోల్చుతున్నారు కొందరు ఫ్యాన్స్. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. మొదటి రెండు వన్డేలు పాకిస్తాన్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఆ జట్టులో లియానగే(54), కమిందు మెండిస్(44), సమరవిక్రమ(42) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఇక 289 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆ జట్టు సీనియర్ బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్లు ఆడి.. విజయాన్ని అందించారు. ఓపెనర్ ఫఖర్ జామన్(78) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. మిడిలార్డర్ బ్యాటర్ బాబర్ ఆజామ్(102) సెంచరీతో.. రిజ్వాన్(51) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచారు. ఆజామ్ 119 బంతుల్లో 8 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. దాదాపుగా 806 రోజుల తర్వాత బాబర్ తన 32వ వన్డే సెంచరీని సాధించాడు. సరిగ్గా ఇన్నే ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి 71వ సెంచరీ చేయడం గమనార్హం. అలాగే ఈ సెంచరీతో బాబర్.. పాకిస్తాన్ జట్టుకు అత్యధిక వన్డే సెంచరీలు(20) చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. సయ్యద్ అన్వర్(20) సరసన నిలిచాడు.