
Asia Cup Trophy : ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే మీడియా నివేదికల ప్రకారం బీసీసీఐ మొహసిన్ నఖ్వీ డిమాండ్ను తిరస్కరించింది. ఏసీసీ, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ మాట్లాడుతూ.. బీసీసీఐ లేదా టీమిండియాకు చెందిన ఏ ఆటగాడైనా దుబాయ్లో ఏసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవచ్చని అన్నారు. అయితే టీమిండియా ఇప్పటికే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది.
ఇండియా టుడే వర్గాల ప్రకారం.. బీసీసీఐ ఒక అంతర్గత వ్యక్తి ద్వారా తెలిపిన సమాచారం మేరకు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ మొండితనాన్ని చూసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ సమస్యను ఐసీసీ సమావేశంలో లేవనెత్తనుంది. భారత బోర్డు మొహసిన్ నఖ్వీ సలహాను అంగీకరించదని ఆ వర్గాలు తెలిపాయి. ఐసీసీ సమావేశం సెప్టెంబర్ 4-7 వరకు దుబాయ్లో జరగనుంది.
దీనికి ముందు సెప్టెంబర్ 30న ఏసీసీ సమావేశం జరిగింది. ఇందులో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మొహసిన్ నఖ్వీ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసియా కప్ ట్రోఫీ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, దాని అసలు హక్కుదారు టీమిండియానే అని రాజీవ్ శుక్లా అన్నారు.
ఇటీవల బీసీసీఐ మొహసిన్ నఖ్వీకి ఈ-మెయిల్ ద్వారా టీమిండియాకు ట్రోఫీని అందజేయాలని అభ్యర్థించింది. దీనిపై భారత బోర్డు కార్యదర్శి దేవ్జీత్ సైకియా మాట్లాడుతూ, నక్వీ దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వకపోతే బీసీసీఐ ఈ విషయాన్ని ఐసీసీకి తీసుకువెళ్తుందని అన్నారు.
సమాచారం ప్రకారం, బీసీసీఐ హెచ్చరికకు సమాధానంగా నఖ్వీ ట్రోఫీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దీని కోసం ఒక ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుకను నిర్వహించాలని కండీషన్ పెట్టాడు, అందులో ఆయన స్వయంగా భారత జట్టుకు ట్రోఫీని అందజేస్తారని తెలిపాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ డిమాండ్ను తిరస్కరించింది. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయంలో ఉంచారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..