Telugu News Spiritual Why is Somnath the First Jyotirlinga? The Astonishing Secret Behind It
Somnath Temple History: సోమనాథ్ ఆలయ రహస్యం.. తొలి జ్యోతిర్లింగం వెనుక దివ్య గాథ
Somnath Secret: భారతదేశ సాంస్కృతిక చరిత్రలో నేడు ఒక సువర్ణ ఘట్టం. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం, ప్రతిష్ఠ జరిగి నేటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలో, దేశంలోని ఇతర జ్యోతిర్లింగాల కన్నా సోమనాథ జ్యోతిర్లింగాన్ని విశిష్టంగా నిలిపే పౌరాణిక రహస్యాలను తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో, అరేబియా సముద్ర తీరానికి సమీపంలోని ప్రభాస్ పటాన్లో ఉన్న సోమనాథ దేవాలయం, శివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. అత్యంత ప్రాచీనమైనదిగా పరిగణించబడుతుంది. అయితే, సుమారు 75 సంవత్సరాల క్రితం, 1951 మే 11న, భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటైన సోమనాథ దేవాలయం పునర్నిర్మించబడింది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఇప్పుడు “సోమనాథ అమృత పర్వం”గా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి ఉన్న 90 మీటర్ల ఎత్తైన శిఖరంపై, 11 పవిత్ర పుణ్యక్షేత్రాల జలాలతో అభిషేకం చేయబడుతుంది.
సోమనాథ జ్యోతిర్లింగం ప్రత్యేకత
హిందూ ధర్మంలో జ్యోతిర్లింగాలు శివుని అనంతమైన దివ్యశక్తికి ప్రతీకలు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటిలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటిది.
“సోమనాథ” అంటే “చంద్రునికి అధిపతి” అని అర్థం. ఈ జ్యోతిర్లింగాన్ని స్వయంగా చంద్రదేవుడే ప్రతిష్ఠించాడని విశ్వాసం ఉంది.
శివ పురాణం, స్కంద పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా సోమనాథ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
చంద్రదేవుడు – దక్ష ప్రజాపతి కథ
పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. ఇవే 27 నక్షత్రాలకు ప్రతీకలు. చంద్రదేవుడు వీరందరినీ వివాహం చేసుకున్నాడు.
కానీ చంద్రుడు తన భార్యలలో రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఆమెతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల మిగిలిన భార్యలు అసంతృప్తి చెందారు.
ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలిసినప్పుడు, ఆయన చంద్రుడిని అన్ని భార్యలను సమానంగా చూడమని హెచ్చరించాడు. కానీ చంద్రుడు ఆ మాటలను పట్టించుకోలేదు. దీంతో కోపించిన దక్షుడు.. అతని తేజస్సు క్రమంగా తగ్గిపోవాలని.. చంద్రుడికి శాపం ఇచ్చాడు.
చంద్రుని క్షీణత, తపస్సు
దక్షుని శాపం వల్ల చంద్రుడు రోజురోజుకీ క్షీణించసాగాడు. అతని వెలుగు తగ్గిపోవడంతో దేవతలు, ఋషులు కూడా ఆందోళన చెందారు.
బ్రహ్మదేవుడు చంద్రుడికి శివుడిని ఆరాధించమని సూచించాడు. అప్పుడు చంద్రుడు ప్రభాస్ పటాన్ ప్రాంతానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి, కఠిన తపస్సు ప్రారంభించాడు.
అతను మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ దీర్ఘకాలం తపస్సు చేశాడు.
శివుని వరం
చంద్రుని భక్తికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడు తన శాపాన్ని తొలగించమని ప్రార్థించాడు.
శివుడు వరం ఇచ్చాడు:
చంద్రుడు పూర్తిగా క్షీణించడు
ప్రతి నెలా 15 రోజులు అతని తేజస్సు పెరుగుతుంది (శుక్ల పక్షం)
తరువాతి 15 రోజులు తగ్గుతుంది (కృష్ణ పక్షం)
ఇలా చంద్రుని జీవన చక్రం ఏర్పడింది.
సోమనాథ జ్యోతిర్లింగం ఆవిర్భావం
చంద్రుడు తనకు విముక్తి ప్రసాదించిన ప్రదేశంలోనే శివుడు శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడు. శివుడు ఆ ప్రార్థనను అంగీకరించి, అక్కడ జ్యోతి రూపంలో స్థిరమయ్యాడు. అలా ఆ ప్రదేశం సోమనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది అని విశ్వాసం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)