
ప్రకాశం జిల్లా: వినాయక చవితి వేడుకల్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. ముస్లిం దంపతులు స్వయంగా గణేష్ విగ్రహాన్ని సమకూర్చడమే కాకుండా.. వినాయక మండపంలో పీటలపై కూర్చొని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.

పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ రబ్బాని దంపతులు హాజరయ్యారు. గణేష్ విగ్రహాన్ని సమకూర్చిన వారు.. మండపంలో ప్రత్యేక పూజల్లోనూ పాల్గొన్నారు. పూజారుల సూచనల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గణనాథుడికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని షేక్ రబ్బాని దంపతులు ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల్లో కాలనీవాసులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొదిలి ప్రాంతంలో హిందూ, ముస్లింలు పరస్పరం ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ మతసామరస్యాన్ని చాటుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

శివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవంలో ముస్లిం మహిళలు పాల్గొని రథాన్ని లాగుతుంటే.. పీర్ల పండుగ సమయంలో హిందూ సోదరులు నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ కనిపించే సంప్రదాయంగా చెబుతున్నారు. అలాగే హిందువుల పండుగల సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాల్లో ముస్లిం కుటుంబాలు పాల్గొంటుంటారు. ఈద్ వేడుకల్లోనూ హిందూ కుటుంబాలు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకుంటున్నాయి.

మతాలు వేరైనా.. మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటుతున్న ఈ సంప్రదాయం మరోసారి పొదిలిలో కనిపించింది. గణపతి మండపంలో ముస్లిం దంపతులు పూజలు నిర్వహించిన ఘటన మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.