Tirumala: తిరుమల కొండపైకి బైక్‌లకు నో ఎంట్రీ.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల క్రమంలో భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఘాట్ రోడ్లలో బైక్‌లకు అనుమతి నిరాకరించింది. 20వ తేదీ వరకు బైక్‌లకు ఘాట్ రోడ్లలో ఎంట్రీ ఉండదు. భక్తులు దీనిని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Tirumala: తిరుమల కొండపైకి బైక్‌లకు నో ఎంట్రీ.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?
Tirumala Ghat Road

Updated on: Sep 19, 2026 | 8:06 AM

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది వస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తిరుమల కొండపైకి బైక్‌లకు అనుమతి నిరాకరించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్లలో అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. రెండూ ఘాట్ రోడ్లలోనూ బైక్‌లకు ఎంట్రీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.

బైక్‌లపై కొండపైకి వచ్చే భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, బస్సులు లేదా ఇతర వాహనాల సౌకర్యాలను ఉపయోగించుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలకమైన గరుడ సేవ ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా మలయప్పస్వామి గరుత్మంతునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనిని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో రానున్నారు. దీంతో టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమతికి వచ్చే భక్తులు తమకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాలను నిలిపివేయాలని సూచిస్తున్నారు. బైక్‌లకు కొండపైకి అనుమతి లేకపోవడంతో తిరుమతిలో బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక టూరిస్ట్ బస్సులకు మ్యాంగో మార్కెట్, ట్రిడెంట్, దేవలోక్ దగ్గర పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక ఫోర్ వీలర్ వెహికల్స్‌కు అలిపిరి లింక్ బస్టాండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులను దారి మళ్లించనున్నారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని పోలీసులు కోరారు. తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను పోలీసులు ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని పోలీసులు కోరారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us