Telugu News Spiritual Sri Vari Brahmotsavam: Why do the streets surrounding temples are called 'Mada streets' What is the meaning of the word 'Mada'?
Srivari Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి విహరించే తిరుమాడ వీధుల విశిష్టత..
ఒకానొక సమయంలో శ్రీవారి ఆలయం చుట్టూ వాహనాలు ఊరేగడానికి సరైన వీధులు ఉండేవి కావు. దీంతో అప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఆలయం వద్ద చేసి.. మిగిలిన కార్యక్రమాలు, స్వామివారి వాహన సేవలు, ఊరేగింపు తిరుచానూరులో జరిపేవారు.
Srivari Brahmotsavam: తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే వీధులను మాడ వీధులు అని అంటారు. ముఖ్యంగా స్వామివారికి జరిగే ఉత్సవాలు, పర్వదినాల సమయంలో మలయప్ప స్వామి విహరించే తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. అయితే ఈ మాడ వీధుల విశిష్టత గురించి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుసుకుందాం.. ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను తమిళులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వీటిని మాడం అని పిలుస్తారు. అయితే ఒకానొక సమయంలో శ్రీవారి ఆలయం చుట్టూ వాహనాలు ఊరేగడానికి సరైన వీధులు ఉండేవి కావు. దీంతో అప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఆలయం వద్ద చేసి.. మిగిలిన కార్యక్రమాలు, స్వామివారి వాహన సేవలు, ఊరేగింపు తిరుచానూరులో జరిపేవారు.
ఎప్పుడు మాడవీధుల్లో ఏర్పాటు అయ్యాయంటే:అనంతరం శ్రీరామానుజుల వారు శ్రీవారి దేవాలయం చుట్టూ నాలుగు వీధులను ఏర్పాటు చేశారు. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ వీధులకు మాడ వీధులని పిలవడం మొదలు పెట్టారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలు ఈ వీధుల్లో ఉరేగింపుని జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు ఇక్కడే పూజలు, సేవలు చేయడం మొదలు పెట్టారు. కాలక్రమంలో టీటీడీ మాడవీధులను మరింత వెడల్పు చేసి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
తూర్పు మాడ వీధి:
శ్రీవారి ఆలయం తూర్పు ముఖంగా ఉన్న వీధి తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి వరకుండే ఈ వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. శ్రీవారి కొయ్య రథం ఉండేది. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉంటాయి. క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలిగించారు.
దక్షిణ మాడ వీధి:
ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. ఈ వీధి మొదట్లో ‘ఊంజల్ మండపం’ ఉంది. కొంతకాలం వరకూ శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీవారు తన ఇద్దరు దేవేరులతో కలిసి ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. కాలక్రమంలో ఊయల సేవను ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట.
పడమర మాడ వీధి:
ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఈ వీధిలో ఒకప్పుడు చాలా మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, కర్ణాటక కళ్యాణ మండపం,వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.
ఉత్తర మాడ వీధి:
ఈ వీధిలో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ప్రస్తుత పుష్కరిణికి పడమర వైపున పాత పుష్కరిణి ఉండేది. దీనిని అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి ‘అచ్యుతరాయ కోనేరు’ అని పేరు మార్చాడని చెబుతారు.
శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధుల్లో చేసే ప్రదక్షిణను మహా ప్రదక్షిణంఅని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో కోనేటి రాయుడు తన దేవేరులతో కలిసి వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనం ఇస్తారు.