
రావణుడి కుమారులు మేఘనాథుడు, అక్షయకుమార్, ప్రహస్తుడు గురించి రామాయణంలో చదివే ఉంటాం. కానీ రావణుడికి ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు కుమారులు, అలాగే ఇద్దరు లేదా ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పలు ప్రాంతీయ రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి. వాల్మీకి రామాయణం లేదా తులసీదాసు రామచరితమానస్ వంటి ప్రధాన స్రవంతి గ్రంథాలలో ఈ కుమార్తెల ప్రస్తావన పెద్దగా కనిపించదు. అయితే థాయిలాండ్, కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాల రామాయణ గాథల్లో, దక్షిణ భారతదేశ జానపద కథల్లో వీరి గురించి వివరంగా ఉంది. ప్రధానంగా స్వర్ణమత్స్య కుంభిని అనే ఇద్దరు కుమార్తెల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
సువర్ణమచ్చ..
థాయిలాండ్ రామకీన్ కంబోడియా రామ్కెర్ రామాయణాల ప్రకారం రావణుడి కుమార్తె పేరు సువర్ణమచ్చ లేదా స్వర్ణమత్స్య. ఈమె అచ్చం బంగారంలా మెరిసిపోయే శరీరంతో సగం స్త్రీగా, సగం చేప రూపంలో ఉండేది. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు రామసేతు నిర్మిస్తున్న సమయంలో రావణుడు తన కుమార్తెను ఆ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆదేశిస్తాడు. సువర్ణమత్స్య సముద్రంలోకి వెళ్లి వానరులు వేస్తున్న రాళ్లను మాయం చేయడం మొదలుపెడుతుంది. ఇది గమనించిన హనుమంతుడు సముద్రంలోకి వెళ్లి ఆమెతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధ సమయంలో ఆమె హనుమంతుడి పరాక్రమానికి ఆకర్షితురాలై అతడితో ప్రేమలో పడుతుంది. రావణుడి చర్యలు తప్పు అని హనుమంతుడు ఆమెకు నచ్చజెబుతాడు. ఆ తర్వాత ఆమె రాళ్లను తిరిగి ఇచ్చేసి రామసేతు నిర్మాణానికి సహకరిస్తుంది. హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తాడు.
థాయ్లాండ్లో అదృష్ట దేవతగా..
స్వర్ణమత్స్యను థాయిలాండ్ కంబోడియాలో అదృష్ట దేవతగా పూజిస్తారు. బ్యాంకాక్ లోని వాట్ ఫ్రా కేయో ఆలయ గోడలపై హనుమంతుడు స్వర్ణమత్స్యకు సంబంధించిన కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. వ్యాపార సంస్థలు, ఇళ్లలో ఆమె చిత్రాలను, చిన్న విగ్రహాలను పెట్టుకుంటే సిరిసంపదలు కలుగుతాయని అక్కడి ప్రజల నమ్మకం. కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ గోడలపై కూడా ఈ బంగారు మత్స్యకన్య దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. భారతదేశంలో రావణుడి కుమార్తెలకు ఆలయాలు లేకపోయినా విదేశాల్లో మాత్రం ఈమెకు ఎంతో గౌరవం దక్కుతోంది.
స్వర్ణమత్స్యతో పాటు రావణుడికి కుంభిని అనే మరో కుమార్తె ఉన్నట్లు జానపద కథలు చెబుతున్నాయి. రావణుడు ఈ కుంభినిని తన సొంత తమ్ముడైన కుంభకర్ణుడికి ఇచ్చి వివాహం చేశాడని అంటారు. కుంభిని ఎంతో తెలివైన భక్తిపరురాలైన మహిళ. కుంభకర్ణుడి దీర్ఘకాల నిద్ర యుద్ధంలో అతని మరణం కారణంగా ఆమె తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించింది. ఇకపోతే కొన్ని జానపద కథలు సీతమ్మను కూడా రావణుడు మండోదరిల కుమార్తెగా వర్ణిస్తాయి. ఒక జోస్యం కారణంగా రావణుడు ఆమెను పెట్టెలో పెట్టి సముద్రంలో విసిరేశాడని ఆ కథల సారాంశం. అయితే వాల్మీకి రామాయణం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తుంది. సీతమ్మ భూమి నుంచి ఉద్భవించిన అయోనిజ అని ప్రధాన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
గమనిక; పైన పేర్కొన్న సమాచారం వివిధ పురాణాలు ప్రాంతీయ జానపద కథలు ఆగ్నేయాసియా దేశాల సాంస్కృతిక విశ్వాసాల ఆధారంగా కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇందులో ఉన్న అంశాలను ప్రధాన స్రవంతి రామాయణ గ్రంథాలతో ముడిపెట్టి చూడకూడదు.