
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా భావిస్తారు. ఈ వ్రతం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే గురు ప్రదోషం మే 28, గురువారం నాడు ఆచరించబడుతోంది. గురువారం రోజున వచ్చే ప్రదోషాన్ని “గురు ప్రదోషం” అని పిలుస్తారు. ఈ రోజున భక్తితో శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. జ్యేష్ఠ మాసం తీవ్ర ఎండల కాలంగా భావించబడుతుంది. అందుకే ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా భోళాశంకరుడు ప్రసన్నమై భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారని పండితులు పేర్కొంటున్నారు.
పంచాంగ వివరాల ప్రకారం త్రయోదశి తిథి మే 28 ఉదయం ప్రారంభమై మే 29 ఉదయం వరకు కొనసాగుతుంది. అయితే ప్రదోష పూజను సాయంత్రం ప్రదోష కాలంలో చేయడం శ్రేయస్కరం.
సాయంత్రం 07:12 గంటల నుంచి రాత్రి 09:15 గంటల వరకు
పురాణ కథనాల ప్రకారం, ఒక పేద బ్రాహ్మణ మహిళ తన కుమారుడితో కలిసి జీవనం సాగించేది. భర్త మరణించడంతో ఆమె భిక్షాటన ద్వారానే జీవించేది. ఒకరోజు ఆమెకు దారిలో గాయపడిన ఓ బాలుడు కనిపించాడు. దయతో అతడిని ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చింది. ఆ బాలుడు నిజానికి ఓ రాజకుమారుడు. శత్రువుల దాడిలో రాజ్యం కోల్పోయి ప్రాణరక్షణ కోసం తిరుగుతుండేవాడు. ఆ మహిళ భక్తితో ప్రదోష వ్రతం ఆచరించేది. ఆమె భక్తికి ప్రసన్నమైన పరమశివుడు ఆ రాజకుమారుడికి తిరిగి రాజ్యం దక్కేలా అనుగ్రహించాడని కథ చెబుతుంది. తరువాత ఆ రాజకుమారుడు ఆమె కుమారుడిని తన రాజ్యంలో మంత్రిగా నియమించాడని పురాణాలు వివరిస్తాయి. ఈ కథ ద్వారా భక్తితో చేసిన శివారాధన కష్టాలను తొలగించి జీవితంలో శుభ ఫలితాలు అందిస్తుందని భావిస్తారు.
భక్తి, నియమంతో గురు ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా శివుని అనుగ్రహం లభించి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని భక్తులు నమ్ముతారు
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)