
Jagannath Rath Yatra Rules: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ క్షేత్రంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి తమ తమ అద్భుతమైన రథాలపై ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు మహా ఊరేగింపుగా బయలుదేరుతారు. రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు రథాల తాళ్లను లాగే భాగ్యం పొందేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, జగన్నాథుడి రథాన్ని ఎవరైనా లాగవచ్చా? దీనికి ఏవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
అవును. జగన్నాథుడి రథాన్ని లాగే అవకాశం ప్రతి భక్తికీ ఉంటుంది. ఈ హక్కు ఏ ఒక్క కులానికి, మతానికి, భాషకు, ప్రాంతానికి లేదా వర్గానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా సంప్రదాయాలను, భద్రతా నిబంధనలను పాటిస్తూ రథయాత్రలో పాల్గొని రథం తాళ్లను లాగవచ్చు. అయితే, జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని రథం చుట్టూ భక్తుల రాకపోకలను నియంత్రించే పూర్తి అధికారం నిర్వాహకులు, పోలీసు యంత్రాంగానికి ఉంటుంది.
అవును. మహిళలు, వృద్ధులు కూడా రథం తాడును లాగే అవకాశం పొందవచ్చు. అయితే, ఆ రోజు జనసందోహం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా కారణాల రీత్యా కొన్ని ప్రాంతాల్లో ప్రవేశాన్ని లేదా రథానికి అత్యంత సమీపానికి వెళ్లడాన్ని అధికారులు పరిమితం చేయవచ్చు. అందువల్ల ప్రతి భక్తుడు తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పాల్గొనడం మంచిది.
హిందూ సంప్రదాయం ప్రకారం, జగన్నాథుడి రథం తాడును భక్తిశ్రద్ధలతో లాగితే పూర్వజన్మల పాపాలు తొలగి, దైవానుగ్రహం లభిస్తుందని, మోక్ష మార్గం సులభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ మహోత్సవంలో పాల్గొని ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు పూరీ చేరుకుంటారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)