ఇప్పుడు కొత్తగా ఆలోచించాలంటూ.. జక్కన్నకు వర్మ ట్వీట్‌

కరోనా లాక్‌డౌన్‌ వేళ సినీ పరిశ్రమ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా.. కొన్ని సినిమాలు మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాయి

ఇప్పుడు కొత్తగా ఆలోచించాలంటూ.. జక్కన్నకు వర్మ ట్వీట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 12:47 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ సినీ పరిశ్రమ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా.. కొన్ని సినిమాలు మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాయి. అయితే అందరికి భిన్నంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూసుకుపోతున్నారు. వరుసగా చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త సినిమాలను ప్రకటిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే క్లైమాక్స్‌, నేక్డ్‌, కరోనా వైరస్‌ చిత్రాలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. త్వరలో పవర్‌ స్టార్ చిత్రాన్ని ఆయన విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 22న రిలీజ్‌ అవ్వబోతుంది. అయితే ఈ ట్రైలర్‌ని చూడాలంటే రూ.25లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే పవర్‌స్టార్ ట్రైలర్ రిలీజ్‌ విషయాన్ని చెప్తూ దర్శకధీరుడు రాజమౌళిని ఉద్దేశించి కొన్ని ట్వీట్లు చేశారు వర్మ. ”పవర్‌స్టార్‌ ట్రైలర్‌ కొని, చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ని రాజమౌళి రూ.150, రూ.200 పెట్టి అమ్మినట్లైతే ఒక్క ట్రైలర్‌తోనే నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. అప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా సినిమాను చూడొచ్చు.

ట్రైలర్‌ను చూసి సినిమాను అమ్మడం పాత ఆలోచన. కానీ రాజమౌళి ట్రాక్ రికార్డును చూస్తే.. ఆయన మూవీ ట్రైలర్‌ని చూసేందుకే చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఆయన ట్రైలర్ కూడా మూవీతో సమానం. రాజమౌళి 10 నిమిషాల షార్ట్‌ ఫిలిం తీసినా.. మల్టీఫ్లెక్స్ టికెట్‌ కొని మరీ దాన్ని చూస్తారు.

హే రాజమౌళి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌ వైపు చూస్తోంది. ప్రస్తుత కాలంలో అదే మార్కెట్‌. కొత్తగా ఆలోచించు. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను డబ్బులు పెట్టి కొని చూసేందుకు ఎదురుచూస్తున్నాం” అని వర్మ ట్వీట్లు చేశారు.