
విజయవాడ: ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, దానికి తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని, ఇంకా ఎక్కువ మంది ఎంపీల మద్దతు కూడా అవసరమని జగన్ చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రోడ్షోలో జగన్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని అన్నారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామని జగన్ వెల్లడించారు.