కాంగ్రెస్ ‌పార్టీ అధికారంలో‌ లేదు.. భవిష్యత్తులో రాదు.. అది ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ అన్న హరీశ్‌రావు

|

Jan 25, 2021 | 4:46 PM

సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గులాబీ..

కాంగ్రెస్ ‌పార్టీ అధికారంలో‌ లేదు.. భవిష్యత్తులో రాదు.. అది ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ అన్న హరీశ్‌రావు
Follow us on

సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు.. భవిష్యత్తులో రాదు.. అందుకే ఆ పార్టీ కార్యకర్తలు , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు నిర్మాణం, ప్రతీ నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వివరించారు.

70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందని హరీశ్‌రావు చెప్పారు. పల్లెలు, పట్టణాల్లో స్పష్టమైన మార్పు‌ కనిపిస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి నేతలు గులాబీ నీడన చేరుతున్నారని అన్నారు.

సదాశివపేటలో రూ.32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు పట్టణ ప్రగతి కింద ప్రతీ నెలా నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. రైతాంగానికి దేశంలో ఎక్కడా‌లేని విధంగా ఉచితంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. జిల్లా మంత్రిగా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.