
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరిస్తారని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.ఎ. ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇక్బాల్ మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తచ్చేందుకు ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్కు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే కర్ణాటక మంత్రి కె.ఎన్. రాజన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే నాయకత్వ మార్పు ఖచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనూ విస్తృత చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. నాయకత్వ మార్పు అనేది పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉంటుందని, దీనిపై బహిరంగంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..