AP Municipal Elections: విశాఖ టీడీపీలో చిచ్చు.. గెలిచి వారమైనా కాలేదు.. జంపింగ్‌ జపాంగ్‌ షురూ

AP Municipal Elections: విశాఖ టీడీపీలో చిచ్చు రగులుతోంది. గెలిచిన ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీ వైపు చూస్తుండటం రాజకీయంగా కాక రేగుతోంది. గాజువాక ఎమ్మెల్యేలతో సమావేశమై

AP Municipal Elections: విశాఖ టీడీపీలో చిచ్చు.. గెలిచి వారమైనా కాలేదు.. జంపింగ్‌ జపాంగ్‌ షురూ
Vsp Tdp

Edited By: Team Veegam

Updated on: Mar 20, 2021 | 3:43 PM

AP Municipal Elections: విశాఖ టీడీపీలో చిచ్చు రగులుతోంది. గెలిచిన ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీ వైపు చూస్తుండటం రాజకీయంగా కాక రేగుతోంది. గాజువాక ఎమ్మెల్యేలతో సమావేశమై తమ వైఖరిని స్పష్టం చేశారు కార్పొరేటర్లు. అయితే సంజాయిషీ కోరుతూ టీడీపీ నోటిసలు పంపినా తగ్గేది లేదంటున్నారు అసంతృప్త కార్పొరేటర్లు. దీంతో విశాఖ రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇటీవల జరిగిన విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించింది. అంతే కాదు వరుస ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కోలుకోలేని షాక్‌ తగిలింది. గ్రేటర్‌ విశాఖలో ఉన్న మొత్తం 98 డివిజన్లలో 58 డివిజన్లు గెలుచుకొని వైసీపీ సత్తా చాటింది. గ్రేటర్ మేయర్ పీఠం సాధించింది. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ బాట పడుతున్నారు.

పంచాయతీల్లో ఎన్నికల్లో ఓటమి మర్చిపోకపముందే మున్సిపోల్స్ ఎన్నికల్లో దారుణ పరాభవం చూసింది. వెరసి టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు జారిపోతున్నారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్ ఎన్నిక జరిగి రెండు రోజులు కాకముందే తెలుగుదేశం కార్పొరేటర్లు జెండా పీకేసి వైసీపీ ఎమ్మెల్యేను కలవడం సంచలనంగా మారింది.

వరుస ఓటములతో ఢీలా పడిపోయిన తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ వైపు చూస్తున్నారని తాజా సంఘటను బట్టి తెలుస్తుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలో టీడీపీ తరుఫున గెలిచిన ఏడుగురు కార్పొరేటర్లు తాజాగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటి అయ్యారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డివిజన్ల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేతో భేటీ అయ్యామని పైకి చెబుతున్నా.. వైసీపీలో చేరేందుకే అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తమ పార్టీ నుంచి తాజాగా గెలుపొందిన ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేతో ఎందుకు భేటి అయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే వారు పార్టీ నోటీసులను కూడా లెక్కచేయడం లేదనే టాక్‌ వినిపిస్తుంది.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు కాకముందే టీడీపీ కార్పొరేటర్లు ఇలా వైసీపీ ఎమ్మెల్యేను కలవడం టీడీపీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీంతో మున్సిపల్ ఎన్నికల పరాజయంతో మరింత మంది కార్పొరేటర్లు వైసీపీ బాట పట్టడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read More:

Etala Rajender Birthday Special: ఉద్యమకారుడి నుంచి రాష్ట్ర మంత్రివరకు.. ప్రజానేత ప్రస్థానం

Telangana Budget: ఉద్యోగుల చూపంతా అసెంబ్లీ వైపే.. సీఎం కేసీఆర్‌ ప్రకటనపై ఉత్కంఠ