
సింధు - గంగా.. రెండు నదులు హిమాలయాల ఒడి నుంచే ఉద్భవించాయి. కానీ వాటి దిశలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. నదుల విభజనలాగే దేశాలు కూడా విడిపోయాయి. కానీ కోట్లాది మంది ప్రజలు ఈ రెండు నదుల నీటిపై ఆధారపడి ఉన్నారు.

సింధు నది దాని మూలమైన చైనాలోని బోఖర్ చు హిమానీనదం నుంచి అరేబియా సముద్రం వరకు 3180 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. సింధు నది సెకనుకు సగటున 6000 నుండి 7000 క్యూబిక్ మీటర్ల నీటిని (క్యూసెక్స్) తనతో ప్రయాణంలో తీసుకువెళుతుంది.

గంగా నది తన జన్మస్థలమైన గంగోత్రి హిమానీనదం నుంచి బంగాళాఖాతం వరకు 2,252 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంగా నది సెకనుకు సగటున 12,000 నుండి 16,000 క్యూబిక్ మీటర్ల నీటిని తనతో పాటు బంగాళాఖాతం వైపుగా తీసుకువెళుతుంది. భారతదేశంలో సింధు నది 710 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నందున గంగా నది సింధు కంటే పెద్దదిగా పరిగణించడం జరిగింది.

సింధు నది టిబెట్ (చైనా) నుండి ప్రారంభమై భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. సింధు నది అతిపెద్ద భాగం ఇక్కడ ఉంది. దీని బేసిన్ ప్రాంతం దాదాపు 1.16 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది.

గంగానది భారతదేశంలోని ఉత్తరాఖండ్ పర్వతాల నుంచి ఉద్భవించి ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మైదానాల గుండా ప్రవహిస్తుంది. తర్వాత అది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని పద్మ అని పిలుస్తారు. దీని బేసిన్ ప్రాంతం దాదాపు 1.09 మిలియన్ చదరపు కిలోమీటర్లు.

గంగా నది ప్రధాన ఉపనదులలో యమునా, ఘఘ్రా, కోసి, గండక్, సన్, చంబల్ ఉన్నాయి. సింధు నదికి ప్రధాన ఉపనదులు చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి నదులు ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్లలో దాదాపు 30 కోట్ల మంది సింధు నదీ పరీవాహక ప్రాంతంపై, భారతదేశం- బంగ్లాదేశ్లలో దాదాపు 40 కోట్ల మంది గంగా నదీ పరీవాహక ప్రాంతంపై ఆధారపడి ఉన్నారు.