
కావలసిన పదార్థాలు: రెండు కేజీల మైదాపిండి, పావుకిలో బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొంచం ఉప్పు, ఇంకా సరిపడా నీళ్ళు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కలర్ ఫుడ్ పసుపు రంగు, డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.

ముందుగా ఒక చిన్న గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇంకా దీనిలో కొంచం ఉప్పు, ఒక టీస్పూన్ బొంబాయి రవ్వను కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల జిలేబీలు ఎక్కువ సమయం వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా, జిలేబీ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి సిద్ధమైన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి.

పిండి పక్కన పెట్టే సమయంలో బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒక పాన్లో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుని, అందులో అర కప్పు నీటిని పోయాలి. బెల్లం కరిగి పాకం కాసేపు మరిగించాలి. పాకం మరీ తీగపాకంలా కాకుండా, రెండు వేళ్లతో పట్టుకుంటే అంటుకునేలా జిగురుగా ఉండాలి. ఈ దశలో అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు రంగు వేయాలి. చివరిగా, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మరసం కలపడం వల్ల పాకం తిరిగి గట్టిపడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పాకం చల్లారకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి.

పది నిమిషాల తర్వాత, పిండి కాస్త చిక్కబడి ఉంటుంది. దీనికి కారణం బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం. ఇప్పుడు పిండిని తక్షణమే పులియబెట్టడానికి మూడు టీస్పూన్ల నిమ్మరసం , అర టీస్పూన్ బేకింగ్ పౌడర్ను కలపాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ పిండిలో బాగా కలిపి చిలుకాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీటిని కలిపి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. నిమ్మరసం, బేకింగ్ పౌడర్ కలపడం వల్ల పిండి తక్షణమే పులిసినట్లు అవుతుంది, జిలేబీల తయారీకి సిద్ధంగా ఉంటుంది.

సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ బాటిల్ లేదా చిన్న రంధ్రం ఉన్న పాలు కవర్లో తీసుకోవాలి. జిలేబీలు వేయించడానికి ఫ్లాట్గా ఉండే పాన్ తీసుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించి జిలేబీలను వేయాలి. జిలేబీలు ఒకవైపు గట్టిపడిన తర్వాత, మరోవైపు తిప్పి క్రిస్పీగా వేయించాలి. జిలేబీలను అధిక మంటపై కాకుండా, మధ్యస్థ మంటపై వేయించడం ముఖ్యం.నూనెలో క్రిస్పీగా వేగిన జిలేబీలను వెంటనే తీసి, గోరువెచ్చని బెల్లం పాకంలో వేయాలి. జిలేబీ చల్లారితే పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు. కాబట్టి వేడి జిలేబీలను గోరువెచ్చని పాకంలో వేసి 30-40 సెకన్లు నానబెట్టాలి. పాకం జిలేబీలకు బాగా పట్టిన తర్వాత, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో జిలేబీలను తయారుచేసుకోవాలి. జిలేబీ చేసేటప్పుడు పాకం చల్లారిపోతే, మళ్లీ కాస్త వేడి చేసి ఉపయోగించాలి. ఈ విధంగా తయారుచేస్తే, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నోరూరించే బెల్లం జిలేబీలు సిద్ధమవుతాయి. ఈ జిలేబీలు రెండు రోజుల వరకు కూడా తమ క్రిస్పీనెస్ను కోల్పోకుండా ఉంటాయి.