
దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో టమాట ధర కిలో రూ.200కి పైగా పెరిగింది. అల్లం ఘాటెక్కింది.. కిలో రూ.320 అయింది. వెల్లుల్లి కూడా కిలో రెండు వందలకు పైగా ఉంది. ఈ ధరలతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తుంటే.. సామాన్యుడు లబోదిబోమంటున్నారు

టమోటా తర్వాత, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో క్యాలీఫ్లవర్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సొరకాయలు, బంగాళదుంపలు, బెండకాయలు, గుమ్మడికాయల ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయించిన పచ్చిమిర్చి ధర రూ.400లకు చేరింది. వర్షాకాలం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.


అనేక కూరగాయల మార్కెట్లో టమాటా మినహా ఇతర కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రూ.220, క్యాప్సికం కిలో రూ.100 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. కొత్తిమీరదీ అదే పరిస్థితి. రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించే కొత్తిమీర ధర రూ.100కి చేరింది.

గత కొన్ని రోజుల క్రితం వరకూ కిలో రూ.30 నుంచి 40కి లభించే కూరగాయలు ఇప్పుడు రూ.100 దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు కూరగాయలను కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ధరలు పెరగడంతో చాలా మంది కూరగాయలను కొనడం కోసం మండీలకు వెళ్లడం మానేశారు. తమకు అందుబాటులో ఉన్న బంగాళదుంపలు, సోయాబీన్స్, శనగపప్పుతో చేసిన కూరగాయలు తిని కడుపు నింపుకుంటున్నారు.