
పచ్చడి కోసం అర కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి. మీరు తక్కువ, ఎక్కువ క్వాంటిటీ మీరు కావాలనుకుంటే కొలతలను అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇంకా మీడియం సైజులో ఉండే, దెబ్బలు లేని, కుళ్ళిపోని, గాట్లు లేని ఉసిరికాయలను ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, కొంచం కూడా తడి లేకుండా పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది.

స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, దానిపై చిల్లుల గిన్నె లేదా ప్లేటు పెట్టి, అందులో ఉసిరికాయలను వేయాలి. మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయలను చేత్తో సులభంగా ముక్కలుగా విడదీయవచ్చు. కత్తి అవసరం ఉండదు. అన్ని ముక్కలను వేరు చేసిన తర్వాత, వాటిని ఒక ప్లేట్లో పరుచుకుని, ఫ్యాన్ కింద లేదా ఎండలో ఒక గంటపాటు ఆరబెట్టాలి. ఒక రోజంతా ఎండబెడితే పచ్చడి నిల్వ కాలం ఇంకా పెరుగుతుంది.

ఈ లోపు, ఒక పాన్లో ఒక టేబుల్స్పూన్ ఆవాలు మరియు అర టేబుల్స్పూన్ మెంతులు వేసి దోరగా, సన్నటి సెగ మీద వేయించాలి. రంగు మారకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చి, మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఒక కప్పు వేరుశనగలు ఇంకా నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఆరబెట్టిన ఉసిరి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ నిదానంగా వేయించాలి.

ఈ ముక్కలు లేత గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల ముక్కలు వగరు లేకుండా, మెత్తగా, ఆవకాయ రుచితో ఉంటాయి. వేయించిన ముక్కలను పచ్చడి కలపడానికి ఉపయోగించే బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన నూనెలోనే తాలింపు వేయాలి. ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించాలి. స్టవ్ ఆపేసిన తర్వాత, రెండు రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, పావు కప్పు తొక్క తీసిన వెల్లుల్లిపాయలను వేసి కలపాలి. ఈ తాలింపు నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన ఉసిరి ముక్కలున్న బౌల్లోకి ఆవాలు-మెంతులు పొడి, పావు కప్పు (50 గ్రాములు) ఎండబెట్టి పొడి చేసిన కల్లుప్పు (లేదా ఉప్పు తగ్గించి సాల్ట్), 50 గ్రాములు లేదా అర కప్పు కారం వేసి బాగా కలపాలి. తర్వాత, చల్లారిన తాలింపు నూనెను వేసి మళ్ళీ కలపాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే పావు కప్పు నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి పాడవుతుంది. ఇలా కలిపిన పచ్చడిని మూత పెట్టి రెండు మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ సమయంలో పులుపు, కారం ముక్కలకు పట్టి నూనె పైకి తేలుతుంది. నూనె సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనెను కలుపుకోవచ్చు.