
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు ఫిబ్రవరిలో భారీగా పెరిగాయి. రుస్లాన్ వెబ్సైట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది కంటే ఈసారి ఐక్యూబ్ అమ్మకాలు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి.

గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2025లో కేవలం 23,581 యూనిట్లుగా ఉన్న ఐక్యూబ్ అమ్మకాలు, ఫిబ్రవరి 2026 నాటికి 38,054 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే ఏడాది కాలంలోనే దాదాపు 14,473 స్కూటర్లు అదనంగా అమ్ముడయ్యాయి. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఐక్యూబ్ ఏకంగా 61.38 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్గా అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలోని టాప్-10 స్కూటర్ల జాబితాను పరిశీలిస్తే.. టీవీఎస్ ఐక్యూబ్ 4వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి మూడు స్థానాల్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి పెట్రోల్ ఇంజిన్ స్కూటర్లు ఉండగా, ఎలక్ట్రిక్ విభాగం నుండి ఐక్యూబ్ మాత్రమే వాటికి గట్టి పోటీనిస్తూ టాప్ 5లో నిలిచింది. ఇది భారత వాహన రంగంలో వస్తున్న పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ ఐక్యూబ్లో 2.2 kWh నుండి 3.5 kWh వరకు మూడు బ్యాటరీ ఆప్షన్లు ఉండగా ఇవి 94 కి.మీ నుండి 145 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయి. ఇక ఐక్యూబ్ S వేరియంట్ 145 కి.మీ రేంజ్ను, హై-ఎండ్ వేరియంట్ అయిన ఐక్యూబ్ ST ఏకంగా 5.3 kWh బ్యాటరీతో 212 కి.మీల అత్యుత్తమ రేంజ్ను అందిస్తున్నాయి.

ధరల విషయానికొస్తే.. టీవీఎస్ ఐక్యూబ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 1.08 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ పద్ధతిలో కొనుగోలు చేసే వారికి ఇది కేవలం రూ.59,999 లకే లభిస్తుంది. కాకపోతే ఈ పద్ధతిలో వినియోగదారులు నెలకు రూ.1,202 చొప్పున సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.