
వేసవి సెలవులు రాగానే.. నగర సందడికి దూరంగా చల్లగా, అందమైన ప్రదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలని, కొంత సేపు అయినా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికీ సుదీర్ఘ సెలవులు ఉండవు. అదే సమయమలో భారీ బడ్జెట్ను భరించలేరు.అటువంటి పరిస్థితిలో, దేశ రాజధాని ఢిల్లీకి పయనం అవ్వండి. అక్కడ సమీపంలో తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడ తక్కువ బడ్జెట్లో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చాలా సరదాగా గడపవచ్చు.

ఈ ప్రదేశాలను రెండు-మూడు రోజుల సెలవుల్లో కూడా పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ వేసవిలో బడ్జెట్ అనుకూలమైన, ఆహ్లాదకరమైన యాత్రను ప్లాన్ చేస్తుంటే ఢిల్లీకి సమీపంలోని ఈ అద్భుతమైన ప్రదేశాల్లో వేసవి సెలవులు గడపడం ఒక చిరస్మరణీయ అనుభవంగా మారుతుంది.

నైనిటాల్: మీరు పర్వతాల చల్లని గాలిని, సరస్సుల అందాలను ఆస్వాదించాలనుకుంటే నైనిటాల్ ఒక గొప్ప ఎంపిక.ఢిల్లీ నుంచి 300 కి.మీ దూరంలో ఉన్న ఇక్కడ మీరు స్థానిక గెస్ట్ హౌస్లు, హోమ్స్టేలు , బడ్జెట్ హోటళ్లలో హాయిగా బస చేయవచ్చు. నైని సరస్సులో బోటింగ్, టిఫిన్ టాప్ , స్నో వ్యూ పాయింట్ వంటి ప్రదేశాలు మీ యాత్రను చిరస్మరణీయంగా చేస్తాయి.

మధుర-బృందావనం: మీరు కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాలను సందర్శించాలనుకుంటే మధుర, బృందావనం గొప్ప, బడ్జెట్ అనుకూలమైన ఎంపిక. ఢిల్లీ నుంచి కేవలం 3-4 గంటల దూరంలో ఉన్న ఈ ప్రదేశాలు సరసమైన వసతి , ఆహార సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. వేసవిలో ఇక్కడి తులసి అడవి, బంకే బిహారీ ఆలయం , యమునా నది ఒడ్డున గడపంలో ఆనందం చెప్పనలవి కాదు.

జైపూర్: "పింక్ సిటీ" జైపూర్ ఢిల్లీ నుంచి దాదాపు 280 కి.మీ దూరంలో ఉంది. దాని చారిత్రక భవనాలు, కోటలు, మార్కెట్లు తక్కువ బడ్జెట్ ప్రయాణీకుడికి కూడా అందించడానికి చాలా ఉన్నాయి. రైలు లేదా బస్సులో ప్రయాణించడం ఆర్థికంగా చౌకగా ఉంటుంది. హాస్టళ్లు లేదా స్థానిక లాడ్జీలు కూడా చాలా చౌకగా ఉంటాయి. తొలకరి జల్లుల్లో ఇక్కడ సందర్శించడం మధురమైన జ్ఞాపకం.

లాన్స్ డౌన్: ఉత్తరాఖండ్ లో అంతగా ప్రాచుర్యం లేని ప్రదేశం కానీ చాలా అందమైనది. ఇది ఢిల్లీ నుంచి దాదాపు 250 కి.మీ దూరంలో ఉంది. రద్దీగా ఉండదు. ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా సమయం గడపవచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ ఖర్చుతో క్యాంపింగ్, నడక మార్గాలు, అందమైన వ్యూ పాయింట్లను అనుభవించవచ్చు.