
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గొప్ప శుభ వార్త.. కార్పొరేట్ లుక్లో మోడల్ బస్టాండ్లు, బిజినెస్ కాంప్లెక్స్లకు కేటాయింపులు మారిన ట్రెండ్.. మారిన ఆర్టీసీ ప్రయాణానికే కాదు.. వినోదానికి, షాపింగ్కు కేరాఫ్ అడ్రస్గా 13 హైటెక్ బస్టాండ్లు. రైల్వేకు పోటీగా, మాల్స్కు దీటుగా TGSRTC సంచలన నిర్ణయం తీసుకుంది. మీ పట్టణంలోనూ ‘హైటెక్’ హంగులు కనబడతాయి. ఇకపై బస్టాండ్ అంటే కేవలం వేచి చూడటం మాత్రమే కాదు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్ హబ్ గా ఉండనుంది.

ప్రయాణికులకు రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పిస్తూ, ఎయిర్పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించాయి.

మల్టీప్లెక్స్ రేంజ్ హంగులు ఇక నుంచి ఒకే చోట అన్నీ. గతంలో బస్టాండ్ అంటే గుర్తొచ్చే ఇరుకు ప్రదేశాలు, అసౌకర్యాలకు ఇక చెక్ పడనుంది. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లలో లభించే ప్రత్యేకతలు ఇవే .. మల్టీ-మోడల్ కనెక్టివిటీ: బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే సదుపాయం. షాపింగ్, బిజినెస్ కాంప్లెక్స్లు: స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ బిజినెస్ విస్తరణ కోసం వాణిజ్య సముదాయాలు (కమర్షియల్ స్పేస్). వినోదం, ఆహారం: ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమింగ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు.

ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్ల కేటాయింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది. నూతన బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న 13 ప్రాంతాలు.. నాగర్కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు ఆధునిక హంగులతో కొత్త కళను సంతరించుకోనున్నాయి. త్వరలోనే ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సరికొత్త వరవడితో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రజాదరణ పొందేలా మారుస్తున్న TGSRTC, ఈ హైటెక్ బస్టాండ్లతో ప్రయాణికులకు మరింత చేరువ కాబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.