
భారతదేశంలో గణేష్ చతుర్థి పండుగను అత్యంత భక్తి, శ్రద్దలతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యను పూజించడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ దేవాలయాలు విశ్వాస కేంద్రాలు మాత్రమే కాదు. చారిత్రక, సాంస్కృతిక, నిర్మాణ కళలతో కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 27 ఆగస్టు 2025న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. వినాయక చవితి పండగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది అనంత చతుర్దశి నాడు గణపతి నిమజ్జనంతో ముగుస్తుంది.

గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని అత్యంత ప్రసిద్ధ గణపతి దేవాలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు ఆధ్యాత్మిక పరమైన అనుభవాన్ని అందించడమే కాదు భారతదేశంలోని విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా చూడవచ్చు. సిద్ధివినాయకుడిని సందర్శించినా లేదా అష్టవినాయకుడికి ప్రదక్షిణ చేసినా.. బప్పా ఆశీస్సులు ప్రతిచోటా భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. వినాయక చవితి సందర్భంగా భక్తులు భారీగా చేరుకునే భారతదేశంలోని ప్రధాన గణపతి దేవాలయాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

సిద్ధివినాయక ఆలయం, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం ఉంది. అంటే "కోరికలను తీర్చే గణేశుడు" అని అర్థం. ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గణేష్ ఆలయం. ఇక్కడఇక్కడ ఒకే నల్ల రాయితో చెక్కిన రెండు చేతుల గణేశుడి విగ్రహం ప్రతిష్టించబడింది. ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. గణేష్ చతుర్థి సందర్భంగా విఐపిల నుంచి సాధారణ భక్తుల వరకు లక్షలాది మంది గణపయ్యని సందర్శించడానికి వస్తారు.

దగదుషేత్ హల్వాయి వినాయక దేవాలయం, పూణే: మహారాష్ట్రలోని పూణే నగరం నడిబొడ్డున ఒక గొప్ప గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవ వైభవాన్ని ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆలయాన్ని బంగారం, వెండితో అలంకరిస్తారు. ప్రత్యేక మహా ఆరతి నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ప్రసిద్ధ హల్వాయి దగ్దుషేత్ తన కొడుకు మరణం తర్వాత స్థాపించారని చెబుతారు.

అష్టవినాయక ఆలయం, మహారాష్ట్ర: మహారాష్ట్రలో అష్టవినాయకులు అని పిలువబడే ఎనిమిది ప్రధాన గణపతి ఆలయాలు ఉన్నాయి. ఈ అష్టవినాయక దేవాలయాలలో మూషక వినాయక ఆలయం, మహాగణపతి ఆలయం, బల్లాలేశ్వర ఆలయం, చింతామణి గణపతి ఆలయం, గిరిజాత్మజ ఆలయం, సిద్ధివినాయక ఆలయం, వరద వినాయక ఆలయం, మోరేశ్వర ఆలయం ఉన్నాయి. ఈ ఎనిమిది ఆలయాలను సందర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఖజురహో గణేష ఆలయం, మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లోని ఖజురహోలో గణేష్ ఆలయం కూడా చాలా ప్రసిద్ది చెందింది. ఖజురహోలోని పశ్చిమ దేవాలయాల సమూహంలో ఉన్న ఈ గణేష్ ఆలయం దాని ప్రత్యేకమైన విగ్రహం, వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. వినాయక చవితి రోజున పర్యాటకులు, భక్తులు ఇద్దరూ ఇక్కడకు భారీ సంఖ్యలో వస్తారు.

రణతంబోర్ త్రినేత్ర గణేష్ ఆలయం, రాజస్థాన్: త్రినేత్ర గణేష ఆలయం రాజస్థాన్లోని రణతంబోర్ కోటలో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి గణేష్ విగ్రహం మూడు కళ్ళుతో భక్తులతో దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఉన్న గణపతికి భారతదేశంలో ఎవరికీ పెళ్లి జరిగినా మొదటి వివాహ ఆహ్వానం ఈ ఆలయంలో కొలువుదీరిన గణపయ్యకు పంపించడం శుభప్రదం అని నమ్ముతారు.

బోహ్రా గణేష్ ఆలయం, ఉదయపూర్: బోహ్రా గణపతి ఆలయం రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉంది. ఈ ఆలయం స్థానిక ప్రజలకు ఒక భారీ భక్తి కేంద్రం. గణేష్ చతుర్థి సందర్భంగా ఇక్కడ గొప్ప ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు

వర సిద్ది వినాయక దేవాలయం, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడి గణపతి విగ్రహం స్వయంభువుగా వెలిసినట్లు పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న వినాయకుడు పరిమాణం కాలక్రమేణా పెరుగుతుందని చెబుతారు. వినాయక చవితి రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వర సిద్ధి వినాయకుడి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటారు.

కలమస్సేరి మహాగణపతి దేవాలయం, కేరళ: కేరళలోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో గణపతి ఆరాధనకు ప్రధాన కేంద్రం. గణేష్ చతుర్థి నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు, నృత్యం, భక్తి సంగీతం నిర్వహిస్తారు.