
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివాస రావు దంపతులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు చేసి, అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించడం జరిగింది.

ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని,జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.

భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని నిర్వహించారు.

సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం,తప్పెట చిందులు,జానపద కళారూపాలు సంప్రదాయ నృత్యం చేశారు. స్వర్ణ రథోత్సవం కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు,ఈఓ యం. శ్రీనివాసరావు,అర్చకస్వాములు, దేవస్థానం సిబ్బంది పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.