
మహాశివరాత్రి హిందూ పండుగలలో ఒకటి. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18.. శనివారం జరుపుకోనున్నారుమహాశివరాత్రి రోజున శివాలయాన్ని సందర్శించడం.. ఆలయంలో రాత్రంతా దీపం వెలిగించి జాగారం చేయడం ఒక సాధారణ ఆచారం. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున శివయ్య ఆశీర్వాదం కోసం ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాల గురించి తెలుసుకుందాం

సోమనాథ్ ఆలయం.. ఈ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ప్రాచీన హిందూ పుణ్య క్షేత్రం. పురాణప్రాశస్త్యం కలది. సోమనాథ్ ఆలయం అనేక సార్లు దోచుకోబడింది.. ధ్వంసం చేయబడింది. పునర్నిర్మించబడింది. ప్రస్తుత పునర్నిర్మాణం.. చాళుక్యుల నిర్మాణ శైలిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో 1951లో పూర్తయింది.

కేదార్నాథ్ మందిరం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం మంచుతో కప్పబడిన శిఖరాలతో కప్పబడిన విశాలమైన పీఠభూమి మధ్యలో ఉంది. కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు లేవు. బూడిద రంగు గోడల మధ్య ఆలయం.. లోపలి గోడలలో అనేక దేవతల బొమ్మలు, పురాణాల దృశ్యాలు ఉన్నాయి. ఆలయం లోపల ఒక రాతి నిర్మాణం శివుని రూపంగా పూజించబడుతుంది.

రామనాథ స్వామి దేవాలయం తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఈ ఆలయం శైవ, వైష్ణవ మతాల సంగమానికి ఉదాహరణ. రామాయణ ఇతిహాసం ప్రకారం.. రాముడు లంకకు వెళ్లే ముందు ఇక్కడ శివుడిని పూజించాడు. ఈ ఆలయంలో 38 మీటర్ల పొడవైన గోపురం, పొడవైన కారిడార్లు, చెక్కిన స్తంభాలు ఉన్నాయి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి.

త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 18వ శతాబ్దంలో మూడవ పీష్వా బాలాజీ బాజీరావు పాత ఆలయం ఉన్న స్థలంలో నిర్మించారు.

లింగరాజు దేవాలయం ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఈ ఆలయాన్ని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఆలయ సముదాయంలో దాదాపు 150 చిన్న, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శివరాత్రి, రుకునా రథయాత్ర రెండు పెద్ద పండుగలు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.