
మేషం: ఈ రాశివారికి శని, గురువులు బాగా ప్రతికూలంగా ఉన్నాయి. రాశ్యధిపతి కుజుడు బలంగా ఉండడం ఒక్కటే వీరిని కాపాడుతోంది. ఈ రాశివారు జూన్ వరకు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అతి కష్టం మీద ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు పెరగడం తప్ప ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండదు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. వీరు తరచూ శివార్చన చేయించడం మంచిది.

కర్కాటకం: ఈ రాశివారికి మొదటి ఆరు నెలలు వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగి, చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. అష్టమ రాహువు వల్ల బంధు మిత్రుల వల్ల మోసపోవడం, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు కోల్పోవడం జరుగుతుంది. రుణ సమస్యలు బాధిస్తాయి. వీరు గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.

సింహం: లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అష్టమ శని, సప్తమ రాహువు వల్ల ఏదో ఒక రూపంలో ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మోసాలు, నమ్మక ద్రోహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం పెరిగినా ఆర్థిక సమస్యలు ఒక పట్టాన పరిష్కారం కాక ఇబ్బంది పడతారు. రాహువు వల్ల తరచూ అనారోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు కాలభైరవాష్టకం పఠించడం చాలా మంచిది.

ధనుస్సు: ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబంలో విభేదాలు, వివాదాలు, అపార్థాలు తలెత్తుతుంటాయి. గృహ నిర్మాణ కార్య క్రమాల్లో మోసపోవడం గానీ, ధన నష్టం జరగడం కానీ ఉంటుంది. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోతారు. శుభ కార్యాలు జరగకపోవచ్చు. వీరు తరచూ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం.

కుంభం: ప్రస్తుతానికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం వృద్ది చెందే అవకాశం ఉన్నా ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఖర్చులు అదుపు తప్పడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, రుణ సమస్యలు ఒత్తిడి కలిగించడం వంటివి చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టానచేతికి అందకపోవచ్చు. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల డబ్బు చేతిలో నిలవని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వీరు తరచూ శివార్చన చేయించడం మంచిది.

మీనం: ఈ రాశిలో శని సంచారం, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉండడం వంటి కారణాల వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. నష్ట దాయక వ్యవహారాలు చిక్కుల్లో పడేస్తాయి. మొండి బాకీలు ఎక్కువవుతాయి. ఉద్యోగంలో జూనియర్లకు పదోన్నతులు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉండదు కానీ, కుటుంబ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. వైద్య ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. వీరు శివార్చన చేయించడం మంచిది.