
తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో పచ్చటి ప్రకృతి అందాల నడుమ, పంట పొలాల మధ్య ఓ శివాలయం ఉంది. ఈ ఆలయం బిరుదాంకపురంగా పేరు గాంచింది. ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే భక్తులు కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి ఉన్న రెండు ఆలయాల్లో ఒకటి 'ఫలణి'లో ఉండగా.. రెండోది బిరుదాంకపురంగాలో ఉంది.

స్థల పురాణం ప్రకారం పూర్వం కానేటి కోటాలో ఉన్న బిరుదాంకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో 118 దేవాలయములు నిర్మించాడు . 118 చెరువులు త్రవ్వించాడు. ప్రస్తుతం రాజు ఏలిన ఈ కోట శిధిలమైపోయింది. అయిదు ఆ కోటలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రస్తుతం భక్తులతో పూజలను అందుకుంటుంది.

శ్రీ గోలింగేశ్వరస్వామి వెలసిన ఈ క్షేత్రం మొదట భూమిలో కప్పబడి ఉందట. ఆ గ్రామంలోని ఓ రైతు యొక్క ఆవు రోజూ తన పాలను ఈ లింగాకారం వున్న ప్రదేశములో కార్చి వెళ్లిపోయేదట. ఆవు పలు ఇవ్వడంలేదని రైతుకు అనుమానం వచ్చి ఒకరోజు ఆవు వెళ్లే ప్రాంతాలను చూశాడట.. అప్పుడు ఆవు ఒక ప్రదేశంలో తన పాలు కార్చి మేత మేస్తూ పక్కకు వెళ్లిందట.. ఈ విషయం గమనించిన పాలికాపు రైతులు చెప్పాడట.

ఆవులకాపరి తన యజమానికి అసలు జరిగింది చెప్పడంతో.. గ్రామస్థులందరికీ ఈ విషయం తెలిసింది. దీంతో గ్రామస్థులు పాలుకార్చిన ప్రదేశానికి వెళ్ళి, అక్కడ పాలు కట్టిన చిన్నమడుగుని చూశారు. దీంతో అక్కడ దేవుడు ఉండి ఉండవచ్చు అని భావించి ఆ గ్రామస్థులు అక్కడ తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ తవ్వకాల్లో పానమట్టంతో సహా లింగం బయటపడింది.

ఈ విషయం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న బిరుదాంక మహారాజుకి తెలిసింది. దీంతో గుడి కట్టించడానికి ముందుకొచ్చాడు. అక్కడ పునాదులు తవ్వుతుంటే మరొక పుట్ట పుట్టింది. అలా ఎన్ని సార్లు త్రవ్వినా పుట్టపుట్టుకొస్తూనే వుంది. చివరకు ఆ పుట్టల నుంచి కుమార సుబ్రమణ్యే శ్వర స్వామి విగ్రహం బయటపడింది. అక్కడ ఉన్న లింగాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు.

లింగేశ్వర స్వామి ఆలయం చక్కటి శిల్పకలలతో కట్టించబడింది. ఈ ఆలయంలో శివ పార్వతుల శిల్పం, కూర్చొని ఉన్న వినాయకుని ప్రతిమ రెండూ శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకలు. ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవం ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.