
పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ వెరైటీ రైస్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 2 నుండి 3 కప్పులు పొడిపొడిగా వండిన అన్నం, ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డ రెబ్బలు ఒలిచినవి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టీస్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 ఎండుమిర్చి, ఒకటి ఉల్లిపాయ సన్నగా తరిగినది, 2 నుండి 3 పచ్చిమిర్చి, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు నూనె.

మసాలా పొడి తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, కందిపప్పు, పల్లీలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

అదే కడాయిలోని నూనెలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

గార్లిక్ రైస్ చేసే విధానం: కడాయిలో మిగిలిన నూనెలోనే కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, రెండు ఎండుమిర్చి మరియు పిడికెడు కరివేపాకు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా పొడిని వేసి, మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేపాలి. ఆపై రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

ఇప్పుడు పొడిపొడిగా ఉన్న అన్నాన్ని, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మసాలా అంతా అన్నానికి బాగా పట్టేలా 4 నుండి 5 నిమిషాల పాటు మీడియం మంటపై టాస్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే టేస్టీ గార్లిక్ రైస్ సిద్ధం! వేడివేడిగా తిన్నా లేదా లంచ్బాక్స్లో చల్లారిన తర్వాత తిన్నా ఎంతో కమ్మగా ఉంటుంది.