తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ పై ఫోకస్ పెంచారు. మిషన్ తెలంగాణాలో భాగంగా మంగళవారం కీలక నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీయార్ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. పార్టీని బలోపేతం చెయ్యడమెలా.. పొత్తులు, పోటీ తదితర అంశాలపై చర్చలు జరిపారు.
తప్పకుండా ఏదో ఒక రోజు తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే నూటికి వెయ్యి శాతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితిపై హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమీక్షించిన చంద్రబాబు.. పార్టీ రాష్ట్రంలో కళకళలాడుతోందని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.
తెలంగాణలో పార్టీ పనితీరు బాగా ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా కితాబిచ్చారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలను ప్రారంభించాలని.. కార్యకర్తలను సంసిద్దం చేయాలని సూచించారు.
ఇటీవల మహానాడులో అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలు చంద్రబాబును అభినందించారు. కాసాని జ్ఞానేశ్వర్కి అధ్యక్ష హోదానిచ్చి, ఇటీవల ఖమ్మంలో భారీ బహింగసభ నిర్వహించి తెలంగాణాలో పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
అయితే, చంద్రబాబు నాయుడు ఈనెల 3న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.. బీజేపీతో టీడీపీ పొత్తు, తెలంగాణ, ఏపీ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు-అమిత్ షా భేటీ తర్వాత తెలంగాణాలో పొత్తులపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే, టీడీపీతో పొత్తు వార్తల్ని తెలంగాణా బీజేపీ కొట్టిపారేసింది. అటువంటి అవసరమే తమకు తేదని తేల్చేశారు బండి సంజయ్. కానీ.. చంద్రబాబుతో చెలిమి అనే సబ్జెక్ట్ ఇంకా బీజేపీ శ్రేణుల్లో నలుగుతూనే ఉంది. నాయకులతో తాజా భేటీ తర్వాత.. చంద్రబాబు పొత్తులపై త్వరలోనే సూచనప్రాయ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బీజేపీ-టీడీపీ అధిష్టానం ఆదేశానుసారం తెలంగాణలో పొత్తులు ఉండవచ్చని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏదీఏమైనప్పటికీ.. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు అమిత్ షాతో భేటీ అవ్వడం.. తెలంగాణ, ఏపీలో పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది.
అయితే, తెలంగాణలో టీడీపీతో దోస్తీపై బీజేపీ నేతలు కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.. టీడీపీతో పొత్తుపై టీ బీజేపీ క్లారిటీ ఇస్తున్నప్పటికీ.. త్వరలో రాజకీయ సమీకరణాలు మారుతాయేమోనని పొలిటికల్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.