
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన టెర్మినల్ 2కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ కూడా సందర్శించారు.

బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేశారు. ఎయిర్ పోర్ట్లో చేపట్టిన ఈ నిర్మాణం సుస్థిర అభివృద్ధికి సహాయపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్2 నిర్మాణాన్ని ఎకో ఫ్రెండ్లీగా నిర్మించారు. నిర్మాణానికి మొత్తం వెదురును వాడడం విశేషం. ఈ నిర్మాణానికి సుమారు రూ. 5000 కోట్లు ఖర్చు అయ్యాయి.

పచ్చదనానికి పెద్ద పీట వేసిన ఈ టెర్మినల్ నిర్మాణాన్ని 'టెర్మినల్ ఇన్ ఎ గ్రీన్' అని పిలుస్తారు. కారిడార్లలో ఉండే గోడలపై కూడా మొక్కలు నాటడం విశేషం.

ఈ కొత్త టెర్మినల్ ఏటా 25 మిలియన్ల మందికి సేవలందించే అవకాశం ఉందని KIA అధికారులు తెలిపారు. హాంగింగ్ గార్డెన్ ఈ టెర్మినల్ ప్రత్యేకతగా అధికారులు చెబుతున్నారు.

ఎయిర్పోర్ట్ లోపల, బయట మొత్తం పచ్చదనంతో నిండి ఉన్న ఇలాంటి ఎయిర్ పోర్ట్ ప్రపంచంలో మరెక్కడ లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులోకి వెళ్తుంటే ఏదో గార్డెన్లోకి వెళుతున్న భావన కలుగుతుంది.