భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రైల్వే శాఖ కూడా వందే భారత్ రూట్లను పెంచుకుంటూ పోతోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు కూత పెడుతున్నాయి.
ఇదిలా ఉంటే వందే భారత్ రైళ్లను రాళ్ల దాడుల సమస్యలు వేధిస్తున్నాయి. కొందరు వ్యక్తులు వందే భారత్ ట్రైన్స్పై రాళ్లతో దాడులు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
గత నెల 28 వ తేదీన సామర్లకోట పిఠాపురం మధ్య వందేభారత్ రైలు పై రాళ్లు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు, ఈ రాళ్ల దాడిలో సీ 11 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైన విషయం తెలిసిందే.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ట్రైన్ సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. ట్రైన్ లో సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి సామర్లకోటకు చెందిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం సామర్లకోట రైల్వే పోలీసులు విజయవాడ రైల్వే కోర్టు కు తరలించారు.