
భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.15కి పార్లమెంట్ వద్దకు వచ్చి ప్రధాని మోదీ.. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. 7.30కి గణపతి హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత రాజదండానికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత సెంగోల్ని పండితుల నుంచి స్వీకరించిన ప్రధాని మోదీ.. దానితో ప్రదక్షిణ చేసి.. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాజదండంతో పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్కి వెళ్లారు. ఆయన వెంట పండితులు కూడా వెళ్లారు. సెంగోల్ని ప్రధాని మోదీ .. స్పీకర్ పోడియం దగ్గర ప్రతిష్టించారు.

అనంతరం పార్లమెంట్ నిర్మాణంలో పాల్గొన్న 10 మంది కూలీలు, కార్మికులను ప్రధాని మోదీ శాలువాలతో సత్కరించారు. వీరంతా భవన నిర్మాణంలో రకరకాల పనులు చేశారు. వారిని సత్కరించారు.

పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, క్యాబినెట్ మంత్రులతో పాటు ప్రధాని మోదీ పాల్గొన్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో మొదటి దశ పూర్తయింది.

ఆ తరువాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలు సావర్కర్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జాతీయ గీతం ఆలపించడంతో మరో కార్యక్రమం ఉండనుంది. పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ లోక్సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శించానున్నారు.

రెండో విడత ప్రారంభ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలా 30 నిమిషాలకు లోక్సభ ఛాంబర్లో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిథులు అందరూ హాజరవుతారు.

అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రసంగాలు ఉంటాయి.