
దోశ పిండి కలిపే పక్కా కొలతలు, ఎర్ర కారం తయారీ, దోశను క్రిస్పీగా ఎర్రటి రంగు వచ్చేలా కాల్చే సీక్రెట్ ఇంగ్రిడియంట్స్ సరిగ్గా తెలిస్తే ఇంట్లోనే ఆ నెల్లూరు మ్యాజిక్ను రీక్రియేట్ చేయవచ్చు. ఆ రుచికరమైన ప్రాసెస్ ఇప్పుడు వివరంగా చూద్దాం.

దోశ పిండి పక్కా కొలతలు: 1 గ్లాసు మినపగుళ్లు, 3 గ్లాసుల బియ్యం, పావు గ్లాసు పచ్చి శనగపప్పు (దోశ మంచి కలర్, క్రిస్పీనెస్ రావడానికి), 2 టీస్పూన్లు మెంతులు, అర గ్లాసు దొడ్డు అటుకులు దోశ మృదువుగా, కరకరలాడుతూ రావడానికి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి మంచి నీటితో కనీసం 3 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత అదే నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా, కాస్త గట్టిగా గ్రైండ్ చేసి రాత్రంతా లేదా 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి.

నెల్లూరు ఎర్ర కారం చట్నీ: ఉల్లిపాయలు, ఎండుమిర్చి లేదా కారం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి రోట్లో లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బి ఘాటైన నెల్లూరు ఎర్ర కారాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనితో పాటు గట్టి పల్లీ చట్నీని రెడీ చేసి పెట్టుకోవాలి.

దోశ వేసే సీక్రెట్ టిప్: దోశ పెనాన్ని బాగా వేడిచేసి, మంటను మీడియంలో ఉంచి ఒక గరిటెడు పిండిని పలుచగా గుండ్రంగా తిప్పాలి. దోశ కాస్త కాలిన తర్వాత దానిపై ఒక చెంచా ఘాటైన నెల్లూరు ఎర్ర కారాన్ని సమానంగా స్ప్రెడ్ చేయాలి. దానిపై పల్లీ చట్నీని పలుచగా పూసి, ఆపై తాజా వెన్న లేదా పాలమీగడను వేయాలి.

వెన్న దోశ వేడికి కరిగి అంతటా వ్యాపించి దోశను అద్భుతమైన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, కరకరలాడేలా మారుస్తుంది. మీకు చట్నీ లోపల వేయడం ఇష్టం లేకపోతే.. కేవలం ఎర్ర కారం, రెండు స్పూన్ల వెన్న మాత్రమే వేసి దోశను ఎర్రగా క్రిస్పీగా కాల్చి తీసి, పక్కన పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి పెనం మీద నుంచి తీసిన ఈ నెల్లూరు వెన్న కారం దోశను పల్లీ చట్నీ, కొద్దిగా కారంతో తింటే ఆ టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్!