
కొబ్బరి నీళ్లు: ఇది ప్రకృతి మనకిచ్చిన అత్యుత్తమ ఎలక్ట్రోలైట్ పానీయం. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తాయి. ఎండలో తిరిగి వచ్చినప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత తక్షణమే సాధారణ స్థితికి వస్తుంది.

సబ్జా గింజలు: వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ గింజలు నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. వీటిని తాగినప్పుడు కడుపులో చల్లగా ఉండడమే కాకుండా, అసిడిటీని, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గోండ్ కటిరా: ఇది చాలా మందికి తెలియని బ్రహ్మాస్త్రం లాంటిది. ఒక రకమైన సహజమైన జిగురు, ఇది రాత్రంతా నీటిలో నానబెడితే జెల్లీగా మారుతుంది. దీనికి సొంత రుచి ఉండదు కాబట్టి నిమ్మరసంలో కానీ, పాలలో కానీ కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరానికి ఎంత చలువ చేస్తుందంటే, పాతకాలంలో వడదెబ్బ తగలకుండా దీనిని ఉపయోగించేవారు.

మజ్జిగ: పిత్త దోషాన్ని తగ్గించడానికి మజ్జిగకు మించిన ఔషధం లేదు. చాలా మంది పెరుగు చలువ అని అనుకుంటారు, కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు స్వల్పంగా వేడి చేస్తుంది. అదే పెరుగును బాగా చిలికి, వెన్న తీసేసి, నీళ్లు కలిపి మజ్జిగలా చేస్తే అది అమృతంతో సమానం. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో మంట, అసిడిటీ ఉన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరింత ప్రభావవంతంగా ఉండాలంటే, మజ్జిగలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవలవణం కలుపుకోవచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గుతుంది.

పండ్లు, కూరగాయలు: నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు శరీర వేడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో వేడి పెరిగినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, అప్పుడు కేవలం నీళ్లు తాగితే సరిపోదు, పోషకాలతో కూడిన పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీర దోసకాయ, సొరకాయ, బీరకాయ, తాటి ముంజలు, కర్బుజా వంటివి తీసుకోవడం మంచిది. ఈ పండ్లను రాత్రి పూట కంటే పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.