
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ అందించింది. తెలంగాణకు నమో భారత్ రిజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ప్రకటించింది. దేశంలోని వివిధ మెట్రో సిటీలను సమీపంలోని పట్టణాలతో కనెక్ట్ చేసేందుకు రైల్వే వ్యవస్థను విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా 2900 కిలోమీటర్ల మేర రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్-వరంగల్ మధ్య కూడా రైలు కారిడార్ నిర్మించనున్నట్లు ప్రకటించింది.

నమో భారత్ రైలు కనెక్టివిటీ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్-వరంగల్ మధ్య ప్రమాణ సమయం భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య జర్నీ టైమ్ రోడ్డు మార్గంలో అయితే మూడు గంటల వరకు పడుతుంది. ఇక రైళ్లల్లో కూడా రెండు గంటలపైనే సమయం పడుతుంది. అయితే ఈ ర్యాపిడ్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం గంటలోనే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించవచ్చు.

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ఆర్ధికంగా పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. తరచూ ఈ రెండు నగరాల మధ్య వేల మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రయాణ సమయం ఎక్కువైతుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గించేందుకు ర్యాపిడ్ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు

ఈ ర్యాపిడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్-వరంగల్ మార్గంలో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశముంది. దీని వల్ల వేల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వరంగల్ ప్రాంతం కూడా మరింతగా అభివృద్ది చెందుతుంది. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు నగరాలను కూడా సమీపంలోని పట్టణాలను కనెక్ట్ చేసేలా నమో భారత్ ర్యాపిడ్ కారిడార్ను నిర్మించనున్నారు.

ఇక నమో భారత్ ర్యాపిడ్ రైళ్లల్లో టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అలాగే అనేక సౌకర్యాలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణం చేయవచ్చు. సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. వీటి వల్ల పారశ్రామిక రంగం కూడా వృద్ది చెందనుంది.