
ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కార్యక్రమం ప్రజా వాణి. ప్రతి సోమవారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించాలన్నదే లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో ఇంతటి కార్యక్రమాన్ని అధికారులు నీరుగారుస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ సోమవారం జరిగిన ప్రజా వాణి కార్యక్రమమే ఇందుకు నిదర్శనం.

సోమవారం వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు, ఆ స్థాయి అధికారులకు మొర పెట్టుకుంటారు. ప్రజా వాణి పేరుతో ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటారు. అంతే కాకుండా నిర్ణీత కాలపరిమితితో వాటిని పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ సుదురు అధికారులకు అదేశాలు జారీ చేస్తుంటారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కానీ ఎన్నో అర్జీలు ఈ సమావేశాలకు వస్తూంటాయి. ఎంతో మంది పేద ప్రజలకు ప్రజా వాణి కార్యక్రమం వరంలా మారిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమ లక్ష్యాలను కిందిస్థాయిలో అధికారులు నీరుగారుస్తున్నారు. జిల్లాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాల్లో అధికారుల తీరుతో ప్రజలకు న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. కేవలం ప్రజల నుంచి ఆర్జీలను తీసుకోవడం తర్వాత గాలికి వదిలేస్తున్నారని అనేక సందర్భాల్లో ప్రజలు తమ ఆవేదన తెలుపుతున్నారు.

తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి సమావేశం మొక్కుబడిగా సాగింది. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఇతర కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ప్రజా వాణిలో అధికారుల తీరు విచిత్రంగా మారింది. అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సమస్యల పరిష్కారానికి ప్రజలు బారులు తీరారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ముఖ్య సమావేశానికి రాకుండా జూనియర్ అసిస్టెంట్ లు, ఆ దిగువ స్థాయి సిబ్బందిని పంపిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇక వచ్చిన అధికారులు సైతం సెల్ ఫోన్ కాలక్షేపాల్లో మునిగిపోయారు. ఇద్దరు అధికారులు ఏకంగా మొబైల్ లో క్యాండిక్రష్ గేమ్ ఆడుకుంటూ టీవీ9 కెమెరాకు చిక్కారు. మరి కొందరైతే క్షణం తీరిక లేకుండా సమావేశ మందిరంలోనే ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేశారు.

ప్రజల సమస్యలు పరిష్కరించే గొప్ప లక్ష్యంతో కూడిన కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం తాండవిస్తోంది. కలెక్టర్ హాజరైన ప్రజావాణి సమావేశంలోనూ అధికారులు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామిక వాదులు హెచ్చరిస్తున్నారు.