
పల్లీలు అరకప్పు, నూనె, జీలకర్ర , మినపగుళ్లు , పచ్చిమిర్చి, పుట్నాలు , వెల్లుల్లి రెబ్బలు , చింతపండు , ఉప్పు , కరివేపాకు , ఇంగువ, ఆవాలు , ఎండుమిర్చి , శనగపప్పు. ఈ పదార్థాలతో చాలా సులభంగా పల్లీల చట్నీ ప్రిపేర్ చేయవచ్చును.

పల్లీలు వేయించుకోవాలి. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, అందులోకి అర కప్పు పల్లీలు వేసి లో మీడియం మంటపై దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా జాగ్రత్తపడాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పొయ్యి ఆపి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పల్లీలపై ఉన్న పొట్టును తీసేయాలి .

ఇప్పుడు అదే కడాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అర టీ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినపగుళ్లు వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత, మీ కారానికి తగ్గట్టుగా 8 నుండి 10 పచ్చిమిర్చి వేసి, అవి కూడా నూనెలో బాగా వేగే వరకు వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆపివేయాలి.

పొయ్యి ఆపిన తర్వాత, అదే వేడిపై 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు, పొట్టు తీసిన రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చింతపండు ముక్క వేసి గరిటెతో ఒకసారి కలిపి పక్కన పెట్టేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమం, పుట్నాలు, వెల్లుల్లి, చింతపండు అన్నింటినీ ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చట్నీని గట్టిగా, కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకోవాలి. దీని కోసం , చిన్న పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. పప్పులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపివేయాలి. ఈ తాలింపును చట్నీలోకి వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ పల్లీల చట్నీ రెడీ.