
కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉదయం జరిగిన సాయుధ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన నగర ప్రజలను, వ్యాపార వర్గాలను భయాందోళనకు గురిచేసింది.

ఉదయం సుమారు 10 గంటల సమయంలో నలుగురు నుంచి ఐదుగురు దుండగులు షోరూమ్లోకి ప్రవేశించారు. కొద్ది సేపటికే ఆయుధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధంతో షోరూమ్లో ఉన్నవారంతా ప్రాణభయంతో చేతులు పైకెత్తి కూర్చున్నారు. అనంతరం దుండగులు ప్రదర్శనలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాగులో నింపుకొని పరారయ్యారు.

ఈ ఘటనలో షోరూమ్ సిబ్బంది రాజేష్, కమలహాసన్, మధుకర్, మస్తాన్ అనే నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, మధుకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనతో జ్యువెలరీ షాపుల్లో పనిచేసే సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.దోపిడీ అనంతరం జ్యోతి నగర్ వైపు పారిపోయిన దుండగులు, ఆత్రుతలో బైక్పై నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు బులెట్స్, ఒక మ్యాగజైన్ను అక్కడే వదిలిపెట్టారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తులో కీలక ఆధారాలుగా భావిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు షోరూమ్ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఈ దోపిడీకి అంతర్రాష్ట్ర ముఠా సంబంధం ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ కోణంలో విచారణ కొనసాగుతోంది.

కరీంనగర్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సమీప జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.పట్టపగలే రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ సాయుధ దోపిడీ ఘటన జ్యువెలరీ వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.