బరువును తగ్గించడంలో కొబ్బరి నీళ్ల పాత్ర కీలకమైనదే. ఐతే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..
ఈ రోజుల్లో వాతావరణం శరవేగంగా మారిపోవడం గమనించే ఉంటారు. ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లు అధికంగా తాగడం వల్ల జలుబు సమస్య వేగంగా పెరుగుతుంది. తక్కువ రక్తపోటు (low blood presure)తో బాధపడేవారు కూడా కొబ్బరినీళ్లు తాగకూడదు. ఈ నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే. ఐతే అధికంగా వినియోగిస్తే మాత్రం శరీరంలో పొటాషియం స్థాయిలు అధికంగా పెరిగి కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.
అంతేకాకుండా కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొటాషియం స్థాయిలు పెరిగి, ఎలక్ట్రోలైట్స్లో అసమతుల్యత ఏర్పడుతుంది. పొటాషియం పెరిగితే హార్ట్ స్ట్రోక్ ప్రమాదం చాలా ఎక్కువ.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వెబ్సైట్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. కొబ్బరి నీళ్ల వల్ల కొందరిలో అలర్జీలు కూడా సంభవిస్తాయి.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాల్లో మరొకటి.. ఇవి తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపించడం. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.