
వేసవి వచ్చేసింది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాతావరణంలో తీవ్రమైన మార్పు వచ్చింది. ఉదయం ఎండ తీవ్రంగా.. సాయంత్రంగా మారేకొద్దీ చల్లని వాతావరణం చోటు చేసుకుంటుంది. మరి కొన్ని చోట్ల వర్షం కూడా పడుతుంది. వాతావరణంలోని ఈ మార్పుల వల్ల శరీరం దానికి అలవాటు పడటానికి ఇబ్బంది పడుతుంది. ఈ పరిస్థితిలో చాలా మందిలో పొడి దగ్గు సమస్య పెరుగుతోంది. గాలిలోని దుమ్ము, పొగ, చిన్న దుమ్ము కణాలు, కాలుష్యం దగ్గును ప్రేరేపిస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈ సమస్యను సకాలంలో నివారించకపోతే అది చాలా కాలం పాటు కొనసాగి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. మాట్లాడటం, పని చేయడం, నిద్రపోవడంలో కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. అందువల్ల కొన్ని సాధారణ ముందుజాగ్రత్త చర్యలను పాటించడం వల్ల ఈ సమస్యను సకాలంలో నివారించవచ్చు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం పొడి దగ్గు ఒకసారి మొదలైతే అది సాధారణంగా ఒకటి లేదా రెండు వారాల పాటు ఉంటుంది. ఇది వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రధాన లక్షణాలలో గొంతులో గరగరగా, మంటగా అనిపించడం, తగ్గని దగ్గు, గొంతు పొడిబారడం, మాట్లాడటంలో ఇబ్బందిగా ఉంటాయి. చాలా సందర్భాలలో రాత్రిపూట దగ్గు తీవ్రమవుతుంది. దీనివల్ల సరిగ్గా నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. కొంతమందికి ఛాతీలో కొద్దిగా ఒత్తిడి లేదా బిగుతుగా కూడా అనిపిస్తుంది. పొడి దగ్గు ఎక్కువ కాలం కొనసాగితే జ్వరం, ఆయాసం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. సకాలంలో సరైన చికిత్సతో ఈ సమస్యను నియంత్రించగలిగితే తీవ్రతను అరికట్టవచ్చు.
పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజంతా పుష్కలంగా నీళ్లు తాగడం, గొంతు పొడిబారకుండా చూసుకోవడం ముఖ్యం. చల్లని ఆహార పదార్థాలకు, ధూళి కాలుష్యానికి దూరంగా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇవే కాకుండా వేడి నీటితో ఆవిరిని పీల్చడం, ఉప్పు నీటితో పుక్కిలించడం కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.